TSLPRB : తెలంగాణలో ఎస్ఐ, కానిస్టేబుల్ తుది పరీక్షల తేదీలను తెలంగాణ పోలీసు నియామక మండలి ప్రకటించింది. సివిల్, ట్రాన్స్పోర్ట్, ఎక్సైజ్, ఫింగర్ ప్రింట్ విభాగాల్లో పోస్టులకు వేర్వేరుగా తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తారు. ప్రస్తుతం జరుగుతున్న దేహదారుడ్య పరీక్షలు ఈ నెల 5 తేదీతో ముగుస్తాయి. మార్చి 12 నుంచి ఏప్రిల్ 23 వరకు పోలీసు ఉద్యోగాలకు ఫైనల్ పరీక్షలను నిర్వహించేందుకు టీఎస్ఎల్పీఆర్బీ ఏర్పాట్లు చేస్తోంది.
ఎస్ఐ తుదిపరీక్షలో మొత్తం నాలుగు పేపర్లు ఉంటాయి. ఏప్రిల్ 8న సివిల్, ఐటీ, ట్రాన్స్పోర్ట్ ఎస్ఐ, ఫింగర్ ప్రింట్ విభాగంలో ఏఎస్ఐ అభ్యర్థులకు మొదటి రెండు పేపర్లను నిర్వహిస్తారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు అర్థమెటిక్, రీజనింగ్ పరీక్ష జరుగుతుంది. మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఇంగ్లిష్ పరీక్ష నిర్వహిస్తారు. ఏప్రిల్ 9న ఉదయం సివిల్ ఎస్ఐ అభ్యర్థులకు మూడో పేపర్ జనరల్ స్టడీస్, మధ్యాహ్నం తెలుగు లేదా ఉర్దూ పరీక్షలు జరుగుతాయి. ఎస్ఐ తుది పరీక్షలకు హైదరాబాద్, వరంగల్, కరీంనగర్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు.
సివిల్, ట్రాన్స్పోర్ట్, ఎక్సైజ్ కానిస్టేబుల్ అభ్యర్థులకు ఏప్రిల్ 23న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జనరల్ స్టడీస్ పరీక్ష నిర్వహిస్తారు. అదే రోజు మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఐటీ అండ్ కమ్యూనికేషన్ కానిస్టేబుల్ అభ్యర్థులకు టెక్నికల్ పరీక్ష నిర్వహిస్తారు. మార్చి 12న ఉదయం ఐటీ అండ్ కమ్యూనికేషన్ ఎస్ఐ అభ్యర్థులకు టెక్నికల్ పరీక్ష, మధ్యాహ్నం ఫింగర్ ప్రింట్ ఏఎస్ఐ అభ్యర్థులకు టెక్నికల్ పరీక్ష జరుగుతుంది.
మార్చి 26న ఉదయం ట్రాన్స్పోర్ట్ ఎస్ఐ అభ్యర్థులకు టెక్నికల్ పరీక్ష, ఏప్రిల్ 2న ఉదయం కానిస్టేబుల్ డ్రైవర్ పోస్టులకు టెక్నికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. అదేరోజు మధ్యాహ్నం కానిస్టేబుల్, మెకానిక్ అభ్యర్థులకు టెక్నికల్ పరీక్ష జరుగుతుంది. ఈ పరీక్షను హైదరాబాద్లో మాత్రమే నిర్వహిస్తామని రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది. హాల్టికెట్ల డౌన్లోడ్, డ్రైవింగ్ టెస్టులకు సంబంధించిన తేదీలను త్వరలో ప్రకటిస్తామని వెల్లడించింది.