Farm house Case : తెలంగాణలో పెను ప్రకంపనలు రేపిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసులో పోలీసులకు షాక్ తగిలింది. పోలీసులు దాఖలు చేసిన మెమోను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. బీఎల్ సంతోష్, తుషార్, జగ్గుస్వామి, శ్రీనివాస్ను నిందితులుగా చేర్చుతూ కోర్టులో పోలీసులు మెమో దాఖలు వేశారు. ఈ పిటిషన్ ను ఏసీబీ కోర్టు కొట్టివేసింది.
ఈ కేసులో చట్టప్రకారం అక్కడ డబ్బు దొరకలేదని న్యాయస్థానం పేర్కొంది. ఘటన జరుగుతున్న సమయంలో నిందితులు అక్కడ లేరని తేల్చిచెప్పింది. కానీ పోలీసులు మాత్రం వారిని నిందితులుగా పేర్కొంటూ మెమో దాఖలు చేయడంపై ఏసీబీ కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఎమ్మెల్యేలకు ఎర కేసులో బీఎల్ సంతోష్, జగ్గుస్వామి, తుషార్.. ఇప్పటి వరకు సిట్ విచారణకు హాజరుకాలేదు. తమపై తప్పుడు కేసులు పెట్టారని పేర్కొంటూ హైకోర్టులో పిటషన్లు దాఖలు చేశారు. కేరళకు చెందిన డాక్టర్ జగ్గుస్వామికి జారీ చేసిన సీఆర్పీసీ 41ఎ నోటీసు అమలును నిలిపివేస్తూ సోమవారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఇదే కేసులో బి.ఎల్.సంతోష్కు సిట్ జారీ చేసిన నోటీసు అమలును నిలిపివేస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది. ఇరుపక్షాల వాదనలు విని నోటీసుల చట్టబద్ధతను తేలుస్తామని పేర్కొంది. కౌంటర్లు దాఖలు చేయాలని సిట్ను ఆదేశిస్తూ విచారణను ఈ నెల 13కు వాయిదా వేసింది. హైకోర్టు ఆదేశాలిచ్చిన తర్వాతే రోజే ఏసీబీ కోర్టు పోలీసులు దాఖలు చేసిన మెమోను కొట్టివేయడం ఆసక్తికరంగా మారింది.