MLA Muthireddy : బీఆర్ఎస్ సీనియర్ నేత, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి ఆయన కూతురు తుల్జాభవాని షాకిచ్చారు. చేర్యాల మున్సిపాలిటీకి చెందిన చెరువు భూమిని కబ్జా చేశారని ఆయనపై ఆరోపణలున్నాయి. తన కూతురు తుల్జాభవాని పేరిట ఈ భూమిని రిజిస్ట్రేషన్ చేశారు. అయితే అక్రమ మార్గంలో తనకిచ్చిన భూమిని తిరిగి మున్సిపాలిటికి అప్పగిస్తున్నట్లు ఎమ్మెల్యే కూతురు తుల్జాభవాని ప్రకటించారు.
ఆదివారం చేర్యాల చెరువు వద్దకు ఆమె వెళ్లారు. తన పేరిట ఉన్న 21 గుంటల స్థలంలో బోర్డును ఏర్పాటు చేశారు. తన తండ్రి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి చేసిన పనికి ఆమె చేర్యాల ప్రజలకు క్షమాపణలు చెప్పారు.
గతంలో ఇదే భూమి కబ్జాకు గురైందని ఆరోపిస్తూ స్థానిక ప్రజలు, విపక్ష నాయకులు, ప్రజా సంఘాలు ఆందోళనలు నిర్వహించాయి. ప్రభుత్వం భూమిని కాపాడాలని డిమాండ్ చేశారు. అయితే అప్పట్లో కబ్జా విషయాన్ని అధికారులు లైట్ తీసుకున్నారనే విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు ఎమ్మెల్యే కూతురే స్వయంగా వచ్చి ఆ భూమిని మున్సిపాలిటీకి అప్పగిస్తున్నట్లు ప్రకటించారు.