sharmila vs kavitha: షర్మిల వర్సెస్ టీఆర్ఎస్ వార్ జోరుగా సాగుతోంది. పరస్పరం మాటల తూటాలు పేలుతున్నాయి. ఇన్నాళ్లూ షర్మిల ఎంతగా తిట్టిపోసినా లైట్ తీసుకున్న గులాబీ దళం.. ఇప్పుడిక తగ్గేదేలే అంటోంది. షర్మిల పాదయాత్రపై దాడి, అరెస్ట్ ఎపిసోడ్ తో పొలిటికల్ హీట్ అమాంతం పెరిగింది.
ఆ వేడిని అలానే రాజేస్తూ.. టీఆర్ఎస్ నేతలు వరుసబెట్టి మాటల దాడికి దిగుతున్నారు. ఎంపీ కవిత, ఎమ్మెల్యే సునీత, మరో ఎంపీ బాల్క సుమన్.. ఇలా గులాబీ ప్రజాప్రతినిధులంతా షర్మిలపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. లేటెస్ట్ గా.. కేసీఆర్ కూతురు కవిత సైతం రంగంలోకి దిగారు. నేరుగా కాకుండా.. ట్విట్టర్ లో పరోక్షంగా షర్మిల-బీజేపీలపై సెటైర్లు వేశారు. ఎంత ఇండైరెక్ట్ గా అన్నా.. ఆ ట్వీట్ షర్మిలకు నేరుగా గుచ్చుకుంది. షర్మిల సైతం ట్విట్టర్ లో కవితను టార్గెట్ చేస్తూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
కవిత: తాము వదిలిన “బాణం”… తానా అంటే తందానా అంటున్న “తామర పువ్వులు”
షర్మిల: పాదయాత్రలు చేసింది లేదు.. ప్రజల సమస్యలు చూసింది లేదు.. ఇచ్చిన హామీల అమలు లేదు.. పదవులే కానీ పనితనం లేని గులాబీ తోటలో ‘కవిత’లకు కొదవ లేదు.
షర్మిల ఇలా కౌంటర్ ఇవ్వడంతో.. ఈసారి కవితాత్మకంగా ట్వీట్ చేశారు కవిత. తాను మట్టి కవితను అంటూ.. షర్మిల కమలం కోవర్టు, ఆరేంజ్ ప్యారెట్టు.. అంటూ కాస్త మసాలా దట్టించారు.
ట్విట్టర్ వచ్చినప్పటి నుంచీ ప్రాసలకు, పంచ్ లకు కొదవ లేకుండా పోతోంది. భలే క్యాచీగా ఉంటున్నాయి ట్వీట్లు. నేతలు రెగ్యులర్ గా మాట్లాడేటప్పుడు ఇలాంటి పదాలు, సామెతలు అస్సలు వినిపించవు. ట్విట్టర్ లోనే కనిపిస్తుంటాయి ఇలాంటి కవితాత్మక విమర్శలు. లీడర్ల అఫీషియల్ ఖాతాల నుంచే ఆ ట్వీట్లు వస్తున్నా.. ప్రత్యేకంగా ప్రొఫెషనల్ రైటర్స్ ను నియమించుకొని.. వారితో ఆ ట్వీట్లు రాయిస్తుంటారు. అందుకే, ట్విట్టర్ లో భావుకత ఎక్కువగా కనిపిస్తుంటుంది.