Sharmila: షర్మిల ఎవరు వదిలిన బాణం? బీజేపీనా? కేసీఆరా? జగనా? ఏమో మొత్తానికి షర్మిల వెనుక ఎవరో ఉన్నారనే ఆరోపణ మొదటినుంచీ వినిపిస్తోంది. ఈ ప్రచారాన్ని ఆమె ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తున్నారు. అయినా, ఆ ఆరోపణ మాత్రం షర్మిలను బాణంలా వెంటాడుతూనే ఉంది. ఇటీవల ప్రధాని మోదీ సైతం షర్మిలకు ఫోన్ చేశారనే వార్త రావడంతో.. అదిగదిగో షర్మిల.. బీజేపీ వదిలిన బాణమేనంటూ మరోసారి చర్చ లేవనెత్తారు. దీంతో.. ఈ విషయాన్ని ఇలానే వదిలేస్తే.. తన రాజకీయ మనుగడకే మోసం అని భావించిన షర్మిల.. ఈసారి తన పిల్లలపై ప్రమాణం చేయడానికైనా సిద్ధమని అన్నారు.
తనకు ఏ పార్టీతోనూ సంబంధం లేదని.. తాను ఎవరో వదిలిన బాణాన్ని కాదని.. కావాలంటే ఈ విషయం తన బిడ్డలపై ప్రమాణం చేసి చెబుతానంటూ సవాల్ చేశారు షర్మిల. టీఆర్ఎస్, బీజేపీల మధ్యనే దోస్తీ ఉందని అన్నారు.
తెలంగాణలో పాదయాత్ర చేసేందుకు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కి అనుమతి ఇచ్చి.. తన యాత్రకు మాత్రం ఎందుకు పర్మిషన్ ఇవ్వట్లేదని షర్మిల నిలదీశారు. ట్యాంక్ బండ్ పై ఆందోళన చేపట్టారు. పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే రోడ్డుపై దీక్షకు దిగారు. పోలీసులు ట్యాంక్ బండ్ పై షర్మిల దీక్షను భగ్నం చేసి.. బలవంతంగా లోటస్ పాండ్ కు తరలించారు. పోలీసుల తీరుకు నిరసనగా తన ఇంటి బయట రోడ్డుపై బైఠాయించి మరోసారి నిరసన తెలిపారు షర్మిల.