Sharmila : వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల తగ్గేదే లే అంటూ ముందుకెళుతున్నారు. తన పాదయాత్రను టీఆర్ఎస్ నేతలు అడ్డుకుంటున్నారని రాజ్భవన్కు వెళ్లి గవర్నర్ తమిళసైకి ఫిర్యాదు చేశారు. పోలీసుల వైఖరిని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆ తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏ కారణం లేకుండానే తమపై పోలీసులు దాడి చేశారని షర్మిల మండిపడ్డారు. సీఎం కేసీఆర్ డైరెక్షన్లోనే ఇదంతా జరిగిందని ఆరోపించారు. కావాలానే శాంతి భద్రతల సమస్య సృష్టించారని విమర్శించారు. కొన్నిరోజులుగా తన పాదయాత్రను టీఆర్ఎస్ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పాదయాత్ర చేస్తే దాడులు చేస్తామని హెచ్చరిస్తున్నారని తెలిపారు. తనకు, పార్టీ కార్యకర్తలకు ఏమైనా జరిగితే కేసీఆర్ దే బాధ్యత అని షర్మిల స్పష్టం చేశారు.
కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా నియంతలా రాష్ట్రాన్ని పాలిస్తున్నారని షర్మిల మండిపడ్డారు. రాష్ట్రంలో లక్షల కోట్ల అవినీతి జరుగుతోందని విమర్శించారు. మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని దివాలా తీయించారని అన్నారు. బీజేపీ కోవర్టు అని తనను నిందిస్తారా.. ఇక్కడి అవినీతిపై సీబీఐకి లేఖ రాస్తానని హెచ్చరించారు. కేసీఆర్ ఫ్యామిలీకి వేల కోట్ల ల్యాండ్ బ్యాంక్ ఉందని ఆరోపించారు. ప్రగతి భవన్ లో దాడి చేస్తే వేల కోట్ల రూపాయలు దొరుకుతాయన్నారు. టీఆర్ఎస్ నేతలు వందల కోట్లు ఎలా సంపాదించారని షర్మిల ప్రశ్నించారు. కేసీఆర్ గతంలో బూతులు మాట్లాడారంటూ ఓ వీడియో క్లిప్ ను ప్రదర్శించారు. ఓ మంత్రి తనపై తీవ్ర విమర్శలు చేస్తే తాను తిరిగి ఆరోపణలు చేయడం తప్పా అని నిలిదీశారు. టీఆర్ఎస్ నేతల అవినీతిని ప్రశ్నిస్తే రెచ్చగొట్టడం అవుతుందా? అని అన్నారు. కేసీఆర్ ఉద్యమకారులను తరమేసి పార్టీలో తాలిబన్లను చేర్చుకున్నారని ఆరోపణలు చేశారు.
తాను తెలంగాణలోనే పుట్టానని షర్మిల స్పష్టం చేశారు. ఇక్కడే చదువుకున్నానని ఇక్కడే పెళ్లి చేసుకున్నానని వివరించారు. కేటీఆర్ భార్య ఎక్కడ నుంచి వచ్చారని ప్రశ్నించారు. ఆమె ఏపీకి చెందినవారు కాదా అని అన్నారు. ఆమెను గౌరవించడం లేదా? విడాకులు తీసుకోవాలని తాము అడుగుతున్నామా? అని షర్మిల ప్రశ్నించారు. కవిత పేరు లిక్కర్ స్కామ్ లో ఉందన్నారు. కవిత, కేటీఆర్ ఇళ్లపై సోదాలు చేయాలన్నారు. మునుగోడు, హుజురాబాద్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ నేతలు చేసిన ఖర్చుపైనా విచారణ జరగాలని డిమాండ్ చేశారు. శుక్రవారం నుంచి పాదయాత్ర తిరిగి కొనసాగిస్తానని షర్మిల స్పష్టం చేశారు.