Sharmila : వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల తగ్గేదేలే అంటున్నారు. పాదయాత్ర అనుమతి కోసం పోరాటం చేస్తున్నారు. తాజాగా ఆస్పత్రి బెడ్ పై నుంచి తెలంగాణ ప్రభుత్వాన్ని మరోసారి టార్గెట్ చేశారు. వైఎస్సార్ బిడ్డను పంజరంలో పెట్టి బంధించాలనుకుంటున్నారని మండిపడ్డారు. అది కేసీఆర్ తరం కాదని స్పష్టం చేశారు. ఉదయించే సూర్యుడిని ఎవరూ ఆపలేరని తేల్చిచెప్పారు.
హైకోర్టు అనుమతి ఇచ్చినా.. పోలీసుల భుజాన తుపాకీ పెట్టి తన పాదయాత్రను కేసీఆర్ అడ్డుకుంటారని షర్మిల ఆరోపించారు. తన పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని ఆమరణ దీక్షకు దిగిన షర్మిల.. తాజాగా ఆస్పత్రి బెడ్పై నుంచే తన వీడియో సందేశాన్ని పంపారు. పార్టీ కార్యకర్తల త్యాగాలను ఎప్పటికీ మరవనన్నారు. వారికి కృతఙ్ఞతలు తెలిపారు.
అంతుకుముందు వైఎస్ షర్మిల ఆరోగ్యంపై అపోలో ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులిటెన్ను విడుదల చేశారు. లోబీపీ, బలహీనత వల్ల ఆమెను ఆస్పత్రిలో చేర్పించారని తెలిపారు. షర్మిలకు డీహైడ్రేషన్, ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్, తీవ్రమైన ఒలిగురియా, అధిక అయాన్ గ్యాప్ మెటబాలిక్ అసిడోసిస్, ప్రీ-రీనల్ అజోటెమియా ఉన్నాయని వెల్లడించారు. ఆమెను డిఛార్జ్ చేసిన తర్వాత 2-3 వారాలు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.
తన పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని రెండు రోజులు క్రితం షర్మిల ఆమరణ దీక్షకు దిగారు. తొలుత దీక్షను ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహం వద్ద చేపట్టారు. అయితే పోలీసులు ఆమెను అక్కడ నుంచి లోటస్ పాండ్ కు తరలించారు. దీంతో అక్కడే దీక్షను కొనసాగించారు. ఆమె ఆరోగ్యం విషమించడంతో శనివారం అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో పోలీసులు లోటస్పాండ్కు చేరుకుని బలవంతంగా ఆమెను అదుపులోకి తీసుకున్నారు. దీక్షను భగ్నం చేసి అపోలో ఆస్పత్రికి తరలించారు.