Sharmila : YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఖమ్మం జిల్లాలోని పాలేరులో పార్టీ కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కరుణగిరి చర్చి ఎదురుగా ఉన్న ఎకరాస్థలంలో పార్టీ కార్యాలయ నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ విజయమ్మ, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగేందుకు వైఎస్ షర్మిల ఇప్పటి నుంచే వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. గెలుపే లక్ష్యంగా ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో పాదయాత్ర చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని గతంలోనే ప్రకటించారు. ఈ నియోజకవర్గంలో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఇప్పుడు పాలేరులో YSRTP పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిలను పాలేరు ప్రజలు ఆశీర్వదించాలని వైఎస్ విజయయ్మ కోరారు. ఉదయించే సూర్యుడిని ఎవరూ ఆపలేరని అన్నారు. గొప్ప సంకల్పంతో షర్మిల మీ ముందుకు వచ్చారని విజయమ్మ తెలిపారు.
పాలేరు ఆ పార్టీలకే పట్టు
2018 ఎన్నికల్లో పాలేరు ప్రజలు అప్పటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు షాకిచ్చారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేంద్రరెడ్డి విజయ సాధించారు. తుమ్మలపై 7,669 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 2016 ఉపఎన్నికలో పాలేరు నుంచి తమ్మల నాగేశ్వరరావు 45,676 ఓట్ల భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. అయితే మూడేళ్లు తిరగకుండానే జరిగిన సాధారణ ఎన్నికల్లో తుమ్మల పరాజయాన్ని చవిచూశారు.
2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి వెంకట్ రెడ్డి టీడీపీ అభ్యర్థి బేబీ స్వర్ణకుమారిపై 4 వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు. అయితే ఆ ఎన్నికల్లో సీపీఐకు 44 వేల ఓట్లు వచ్చాయి. ఈ నియోజకవర్గంలో సీపీఐకు బలమైన ఓటు బ్యాంకు ఉంది. వామపక్షాలకు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ తో పొత్తు ఉంటుందని తెలుస్తోంది. ఈ స్థానాన్ని కేసీఆర్ వామపక్షాలకు కేటాయిస్తారని ప్రచారం సాగుతోంది. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గట్టి పట్టు ఉంది. ఇటు కాంగ్రెస్, అటు సీపీఐ బలంగా ఉన్న ఈ స్థానంలో గెలిచేందుకు షర్మిల ఎలాంటి వ్యూహంతో ముందుకెళుతున్నారో మరి.