Sharmila: ఎంతైనా షర్మిలను ఒప్పుకోవాల్సిందే. పక్కా ప్రొఫెషనల్ పాలిటిక్స్ చేస్తున్నారు. సర్కారును కార్నర్ చేయడానికి.. ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోవడం లేదు. పాదయాత్రలు, ధర్నాలు, దీక్షలతో ఏడాదికి పైగా నిత్య పోరాటం చేస్తున్నారు. పోలీసులు పలుమార్లు అరెస్టులు చేసినా.. తగ్గేదేలే అన్నట్టు రాజకీయం చేస్తున్నారు. లేటెస్ట్గా ఉమెన్స్ డే సందర్భంగా.. తెలంగాణలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు నిరసనగా వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల ట్యాంక్బండ్ దగ్గర మౌనదీక్ష చేపట్టారు.
రాణి రుద్రమదేవి, చాకలి ఐలమ్మ విగ్రహాలకు షర్మిల పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం అక్కడే మౌన దీక్షకు కూర్చున్నారు. ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. షర్మిల చేస్తున్న మౌనదీక్షను భగ్నం చేశారు. ఎప్పటిలానే ఆమెను అదుపులోకి తీసుకుని.. స్టేషన్కు తరలించారు.
దీక్షకు ముందు షర్మిల.. కేసీఆర్, కవితలపై పదునైన విమర్శలు చేశారు. కవిత సిగ్గులేకండా లిక్కర్ వ్యాపారం చేసి.. స్కామ్లో చిక్కుకుని.. మహిళల గౌరవాన్ని దెబ్బతీసిందని మండిపడ్డారు. రాష్ట్ర కేబినెట్లో మహిళలకు సముచిత స్థానం ఇవ్వలేదు కానీ.. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం కవిత ఢిల్లీలో ధర్నా చేస్తానంటోందని విమర్శించారు.
మహిళల భద్రత విషయంలో కేసీఆర్ ప్రభుత్వం పచ్చి అబద్ధాలు చెబుతోందన్నారు షర్మిల. అత్యాచారాలు, కిడ్నాప్లలో రాష్ట్రం నెంబర్ వన్గా నిలిచిందన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే ఎంతో మంది మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడ్డారని ఆరోపించారు. స్వయంగా మంత్రుల బంధువులు రేప్లు చేసినా చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం మహిళలకు ఒక ల్యాండ్ మైన్లా తయారయ్యిందని.. మహిళల పట్ల ఎక్కడ ఏ బాంబు బ్లాస్ట్ అవుతుందో తెలియని పరిస్థితి ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో ఒక్క కవితకు మాత్రమే రక్షణ ఉందని.. మిగతా మహిళలు అంటే కేసీఅర్కు లెక్కే లేదన్నారు షర్మిల.