Sharmila: వైఎస్సార్. రాజకీయ రారాజు. వైఎస్ జగన్, పోరాట యోధుడు. ఇప్పుడు ఏపీ సీఎం. వైఎస్ షర్మిల, ఇన్నాళ్లు అన్నకు తగ్గ చెల్లెలు. ఇప్పుడు తెలంగాణ కోడలు. రాజకీయం వారి రక్తంలోనే ఉన్నట్టుంది. వైఎస్సార్లానే జగన్ కాంగ్రెస్తో, టీడీపీతో పోరాడి గెలిచారు. ఇప్పుడు తండ్రి, అన్నల బాటలోనే.. చెల్లి షర్మిల సైతం పొలిటిక్ ఫైట్ మొదలుపెట్టారు. తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తానంటూ కదం కదిపారు.
మొదట్లో షర్మిల పార్టీని అంతా లైట్ తీసుకున్నారు. ఆ.. ఏం అవుతుందిలే అనుకున్నారు. కానీ, రాను రాను షర్మిల రాజకీయంగా రాటుదేలడంతో అధికారపార్టీ ఉలిక్కిపడుతోంది. పాదయాత్రలకు పదేపదే బ్రేకులు వేస్తున్నారు. కనీసం ధర్నాలు, దీక్షలు కూడా చేయనీయడం లేదు. హౌజ్ అరెస్ట్తో ఇంటి నుంచి బయటకే రానీయడం లేదు. అంతలా సర్కారును కలవరపెడుతున్నారు షర్మిల.
వైఎస్సార్టీపీలో ఎంతమంది నేతలున్నారు? ఆ పార్టీకి ఎంతమంది కార్యకర్తలు ఉన్నారనే విషయం పక్కనపెడితే.. షర్మిల వన్ ఉమెన్ షో తో రాజకీయంగా అదరగొడుతున్నారు. ప్రగతి భవన్ ముట్టడి, గవర్నర్కు ఫిర్యాదు, దర్యాప్తు సంస్థలకు కంప్లైంట్లు, ట్విట్టర్లో రెగ్యులర్గా తూటాల్లాంటి విమర్శలు.. ఇలా షర్మిల రాజకీయంగా మిలమిలా మెరుస్తున్నారు.
అయినా, ఇంత చేసినా పొలిటికల్గా రావాల్సినంత మైలేజ్ మాత్రం రావడం లేదనేది వాస్తవం. షర్మిలను తెలంగాణ ప్రజలు ఇంకా కంప్లీట్గా ఓన్ చేసుకోలేకపోతున్నారు. ఇప్పటికీ ఆమెపై ఏదో అనుమానం? షర్మిల నిబద్దతపై సందేహం. అయినా, అవేవీ పట్టించుకోకుండా.. తన పని తాను చేసుకుపోతున్నారు. పోలీసుల నుంచి మరీ నిర్బంధం ఎక్కువవటంతో.. లేటెస్ట్గా మరో పదునైన వ్యూహాన్ని విపక్షాల ముందు ఉంచారు వైఎస్ షర్మిల.
ఏ రెండు రాజకీయ పార్టీలకు పడని ఈరోజుల్లో.. అందులోనూ ఢిల్లీ స్థాయిలో తీవ్రంగా పోట్లాడుకుంటున్న కాంగ్రెస్, బీజేపీలను.. కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్కటి చేసే ప్రతిపాదన చేయడం రాజకీయంగా సంచలనమే. నిరుద్యోగ సమస్యపై కాంగ్రెస్, బీజేపీ, వైఎస్సార్టీపీలు కలిసికట్టుగా పోరాడదామంటూ ముందుకొచ్చారు షర్మిల. నేరుగా పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి, బీజేపీ చీఫ్ బండి సంజయ్లకే ఫోన్ చేసి.. కూటమి కడదామంటూ ప్రపోజల్ పెట్టడమంటే మాటలా? అది షర్మిలకే సాధ్యమైంది అంటున్నారు.
రేవంత్రెడ్డి పార్టీలో చర్చించి చెబుతామన్నారు. బండి సంజయ్ త్వరలో సమావేశం అవుదామన్నారు. ప్రస్తుతానికి వారిద్దరి నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే, ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చే అవకాశం తక్కువే అయినా, షర్మిల ప్రతిపాదన మాత్రం చర్చనీయాంశం. ప్రతిపక్షాలపై అధికార బలంతో దాడి చేస్తున్న బీఆర్ఎస్ను ఎదుర్కోవాలంటే.. విపక్షమంతా ఉమ్మడి పోరాటం చేయాలనే ఆలోచన మంచిదే. అయితే, ఎవరి పొలిటికల్ మైలేజ్ వాళ్లు చూసుకునే ఈ రోజుల్లో ఇది ఆచరణ సాధ్యమా? అందులోనూ టామ్ అండ్ జెర్రీలా ఫైట్ చేసుకునే కాంగ్రెస్, బీజేపీలు షర్మిలతో కలిసి వస్తాయా?