Sharmila : ఎల్బీ నగర్ పోలీసు స్టేషన్ లో గిరిజన మహిళపై జరిగిన దాడిని ఖండిస్తూ వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన నిరసన ఉద్రిక్తతలకు దారితీసింది. వెంటనే బాధితురాలికి రూ. 25 లక్షల పరిహారం ఇవ్వాలని షర్మిల డిమాండ్ చేశారు. గిరిజన మహిళ లక్ష్మి చికిత్స పొందుతున్న ఆసుపత్రి వద్ద ధర్నా దిగారు. ఆగస్టు 15 రాత్రి జరిగిన దాడి ఘటనను తీవ్రంగా ఖండించారు.
బీఆర్ఎస్ పాలనలో పోలీసులు నుంచి కూడా మహిళలకు రక్షణలేదని షర్మిల మండిపడ్డారు. బాధితులను కాపాడాల్సిన పోలీసులే దాడికి పాల్పడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి దాడులు చేసేవారు ఫ్రెండ్లీ పోలీసులు అని చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు.
షర్మిల ఆందోళన చేసిన సమయంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సమయంలో పోలీసులకు, వైఎస్ఆర్టీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. షర్మిలను అరెస్టు చేసిన పోలీసులు.. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.