Sharmila: ఇన్నాళ్లుగా ప్రశాంతంగా సాగుతున్న వైఎస్ షర్మిల పాదయాత్రలో ఒక్కసారిగా ఉద్రిక్తత తలెత్తింది. ఇటీవలే 3500 కిలోమీటర్ల మైలురాయిని చేరుకోగా.. ఆ వెంటనే ఆమె పాదయాత్రపై దాడి జరగడం కలకలం రేపుతోంది. నర్సంపేట నియోజకవర్గంలో షర్మిల బస్సుకు ఉన్న ఫ్లెక్సీలపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు టీఆర్ఎస్ వర్గీయులు. దీంతో ఫ్లెక్సీలతో పాటు బస్సుకు బయటి వైపు మంటలు అంటుకున్నాయి.
తమ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి వ్యతిరేకంగా షర్మిల ఘాటైన వ్యాఖ్యలు చేయడంపై మండిపడుతూ ఈ దారుణానికి తెగబడ్డారు. షర్మిల గో బ్యాక్ అంటూ గులాబీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వైఎస్సార్ టీపీ శ్రేణులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత తలెత్తింది. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు కార్యకర్తలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. షర్మిలను అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించాలని చూశారు. అయితే, షర్మిలను అరెస్ట్ చేయనీయకుండా కార్యకర్తలు అడ్డుపడటంతో పోలీసులతో తోపులాట జరిగింది. అతికష్టం మీద లింగగిరి దగ్గర షర్మిలను అరెస్ట్ చేశారు పోలీసులు.
తన అరెస్టుపై షర్మిల ఫైర్ అయ్యారు. పాదయాత్రకు అనుమతి ఉన్నా తనను ఎలా అడ్డుకుంటారని నిలదీశారు. టీఆర్ఎస్ గుండాలు పెట్రోల్ దాడి చేసినంత మాత్రాన ప్రజా సమస్యలపై తన పోరాటం ఆగదని తేల్చిచెప్పారు షర్మిల. దాడి చేసిన టీఆర్ఎస్ గుండాలను అరెస్ట్ చేసి హత్యాయత్నం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.