Shakeel Son : తలకాయలు మార్చేయడం సినిమాల్లో చూసుంటారు. పోకిరీ డైలాగ్కు ఏమాత్రం తగ్గని సీన్ పంజాగుట్టలో బయటపడింది. సింగిల్ డైలాగ్.. పాతిక లక్షల రూపాయల డీల్.. BRS మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడి కారు ప్రమాదంలో వెలుగు చూస్తున్న వాస్తవాలివి. ప్రజాభవన్ దగ్గర జరిగిన ప్రమాదంలో ప్రధాన నిందితుడు రాహిల్ ను బయటకు తీసుకెళ్లేందుకు 20 నుంచి 25 లక్షలు చేతులు మారినట్టు ఆరోపణలు వస్తున్నాయి.
ఈనెల 23వ తేదీ అర్ధరాత్రి దాటాక ప్రమాదం జరగింది. ఆదివారం తెల్లవారుజామున పోలీస్ స్టేషన్ దగ్గరకు చేరుకున్న నలుగురు పోలీసులతో మంతనాలు జరిపినట్టు సీసీటీవీ ఫుటేజ్లో అధికారులు గుర్తించారు. మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ను కేసు నుంచి తప్పించేందుకు 25 లక్షల వరకు చేతులు మారినట్టు ఆరోపణలు వస్తున్నాయి. డబ్బుల పంపిణీలో తలెత్తిన విభేదాలతో విషయం బయటకొచ్చింది. అధికారులు అంతర్గత విచారణ జరిపారు. పంజాగుట్ట CI పాత్రపై ఆధారాలు దొరకడంతో ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు.
గతంలోను ఓ ప్రమాదం చేసి, ఒక పాప ప్రాణాలు తీసిన కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్పై ఆరోపణలు వచ్చాయి. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం ఉండడంతో అధికారుల్ని మేనేజ్ చేసుకుని బయటపడ్డాడనే విమర్శలు వచ్చాయి. అలవాటైన వ్యవహారంగా రాహిల్ మరో ప్రమాదం నుంచి అలాగే మేనేజ్ చేసుకుని తప్పించుకున్నాడనే ఆరోపణలు దాదాపు రుజువయ్యాయి. పోలీస్ స్టేషన్ నుంచి బయటపడిన రాహిల్.. సోమవారం దుబాయ్కి పారిపోయినట్టు పోలీసులు గుర్తించారు. అతనిపై బుధవారం లుకౌట్ నోటీసులు జారీ చేశారు. దుబాయి నుంచి హైదరాబాద్కు రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు.
.
.