Telangana : తెలంగాణ క్రీడాశాఖలో జరుగుతున్న బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్ హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ ఓఎస్డీ హరికృష్ణపై లైంగిక వేధింపులు ఆరోపణలు రావడంతో సస్పెన్షన్ వేటు పడింది. ఈ ఘటన మరువక ముందే ఓ జాతీయస్థాయి క్రీడాకారిణికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేషీలో పనిచేస్తున్న డేటా ఎంట్రీ ఆపరేటర్ సురేందర్ లైంగిక వేధింపులకు గురిచేశాడని ఆరోపణలు వచ్చాయి. వారం క్రితం ఈ విషయం తెలుసుకుని ఉద్యోగి సురేందర్ను మంత్రి శ్రీనివాస్ గౌడ్ .. పేషీ నుంచి తొలగించేశారు.
ఇలాంటి ఘటనలు బయటకు వస్తున్న ప్రతిసారీ అధికారులు నిర్లక్యంగానే ఉంటున్నారు. సస్పెన్షన్ చేసి చేతులు దులుపుకుంటున్నారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు విధుల నుంచి తొలగించినా మళ్లీ పునరావృతం కావని గ్యారెంటీ ఏంటనీ ప్రశ్నిస్తున్నారు. పరువుపోతుందని చాలా మంది తమ బాధలు చెప్పుకోవడానికి బయటకు రాాలేకపోతున్నారని బాధితులు వాపోతున్నారు. ప్రభుత్వం దీనిపై దర్యాప్తు చేసి నిందితులను శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోసారి ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫేషీలో పనిచేస్తున్న సురేందర్ అనే ఉద్యోగి వ్యవహారం మెల్లమెల్లగా బయటకు వస్తోంది. సాయం కోసం అతని దగ్గరకు వెళ్తే అనుచితంగా మాట్లాడటంతోపాటు అసభ్యకర సందేశాలు పెడుతున్నారని సాక్ష్యాత్తు జాతీయ స్థాయి క్రీడాకారిణే రోడ్డెక్కింది. ఇంకా ఎవరికైనా ఇలా జరుగుంటే భయపడకుండా బయటకు రావాలని కోరుతోంది. క్రీడాశాఖలో అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అంటూ గొప్పలు చెప్పుకుంటున్నారని మండిపడింది. ట్రైనర్లు, సరైన సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నామని తెలిపింది.