Singotam Ramu Murder Case Update: హైదరాబాద్లో ఇటీవల జరిగిన సింగోటం రాము హత్య కేసులో మరో ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు జూబ్లీహిల్స్ పోలీసులు. గతంలో 8 మంది నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.. సోమవారం మరో ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు రౌడీషీటర్ మహ్మద్ జిలానీ, ఫరూక్, ఫిరోజ్,యూనిస్, గణపతి, టక్కరి రాజు, దుర్గం కమలాకర్ను రిమాండ్కు తరలించారు. ఈ కేసులో మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు చెబుతున్నారు పోలీసులు.
నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ సమీపంలోని సింగోటం గ్రామానికి చెందిన పుట్టా రాము ముదిరాజ్.. అలియాస్ సింగోటం రామన్న ఈ నెల 7న యూసుఫ్గూడ సమీపంలోని LNనగర్లో నివాసముంటున్న హిమాంబీ అలియాస్ హసీనా ఇంట్లో దారుణ హత్యకు గురయ్యాడు. హత్య జరిగిన మూడు రోజుల తర్వాత ప్రధాన నిందితుడు మణికంఠ, వినోద్, హిమాంబీ, నసీమాతో సహా 8 మంది నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు. అయితే హత్య అనంతరం పరారీలో ఉన్న మరో ఏడుగురిని కూడా సోమవారం అరెస్ట్ చేశారు.
Read More: కరీంనగర్లో భారీ అగ్ని ప్రమాదం.. పేలిన గ్యాస్ సిలిండర్లు..
జిలానీ పాషాపై రెండు హత్య కేసులతో పాటు మరో నాలుగు ఇతర కేసులు కూడా ఉన్నాయి. మహ్మద్ ఫిరోజ్ ఖాన్ అసిఫ్నగర్లో రౌడీషీటర్గా చెలామణి అవుతున్నాడని.. జిలానీ సోదరుడు ఫరూక్పై నర్సాపూర్లో హత్య కేసు, షేక్ యూనిస్పై మాదాపూర్ పీఎస్లో డెకాయిటీ కేసు, దుర్గం కమలాకర్పై మేడ్చల్లో డ్రగ్స్ కేసు ఉన్నట్లు పోలీసుల విచారణలో తెలిసింది. వీరంతా నర్సాపూర్ అడవుల్లో మణికంఠ నిర్వహించే పేకాటకు సహకరిస్తుంటారని గుర్తించారు. గతంలో పేకాట ఆడించే పుట్టా రాము, మణికంఠకు మధ్య విభేదాలు రావడంతో పాటు LNనగర్లో నివాసముంటున్న హిమాంబీ, ఆమె కుమార్తెతో ఉన్న విభేదాల కూడా హత్యకు కారణమని పోలీసుల విచారణలో వెల్లడైంది.