Teenmar Mallanna : తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్. తెలంగాణ ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు ఇది. టీవీ ఛానల్ లో యాంకర్ గా మొదలైన అతని ప్రయాణం రాజకీయాల వైపు నడిచింది. యూట్యూబ్ ఛానల్ ద్వారా కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ పాపులారిటీ సంపాదించారు. సోషల్ మీడియాలో తీన్మార్ మల్లన్నకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. క్రమంగా తెలంగాణ యువతలో క్రేజ్ పెంచుకున్నారు. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దిగితే దాదాపు గెలుపుఅంచుల వరకు వెళ్లారు.
అధికార పార్టీ బీఆర్ఎస్ కు ముచ్చెమటలు పట్టించడం అంటే మామాలు విషయంగా కాదు. ఎలాంటి ఆర్థికబలం, అంగబలం లేకపోయినా.. యువ ఓటర్ల ఆదరణతోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చారు మల్లన్న. ఇప్పుడు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్ రావు ఠాక్రే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఎందుకు ఆయన కాంగ్రెస్ వైపు అడుగులు వేశారో బిగ్ టీవీ ఇంటర్వూలో వెల్లడించారు.
నీళ్లు నిధులు నియామకాల కోసం ఏర్పాటు చేసుకున్న తెలంగాణ దొరల పాలయ్యిందని తీన్మార్ మల్లన్న ఆవేదన వ్యక్తం చేశారు. నీళ్లు ఫామ్ హౌస్ కు.. నిధులు దొర ఇంటికి .. నియామకాలు కల్వకుంట్ల కుటుంబానికి వచ్చాయన్నారు. బీసీల్లో చైతన్యం రావాలని అన్నారు. బీసీ వర్గాలు ఏకం కావాలని పిలుపునిచ్చారు.
కేసీఆర్ ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్ పెద్ద స్కాం అని విమర్శించారు మల్లన్న. అనుభవదారుని కాలమ్ తీసేసి.. మళ్లీ తెలంగాణలో దొరలు రివర్స్ మైగ్రేషన్ చేయడానికి దారులు వేసిన ధరణి.. దరిద్రం అని వాపోయారు. 40 లక్షల నిరుద్యోగుల జీవితాలతో బీఆర్ఎస్ ప్రభుత్వం చెలగాటలాడిందని మండిపడ్డారు.
గ్రూప్ -2 అభ్యర్థి ప్రవళిక సూసైడ్ వ్యవహారంపై తీన్మార్ మల్లన్న ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె మరణానికి ప్రేమ వ్యవహారం అంటగట్టిన ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు తాము ఎన్నికల బరిలో దిగడంలేదని వివరించారు. ముందుగా మేడ్చల్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని తీన్మార్ మల్లన్న అనుకున్నారు. కానీ తెలంగాణ ప్రజల మంచి కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరానన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించడమే తన అంతిమ లక్ష్యమని తీన్మార్ మల్లన్న స్పష్టం చేశారు.
.
.