RevanthReddy: వారం రోజులుగా ఒకటే చర్చ. గత వారమంతా అదే రచ్చ. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డైలాగులు డైనమైట్లలా పేలాయి. ఆయన చేస్తున్న పాదయాత్ర తెలంగాణ భవన్ ను షేక్ చేస్తోంది. ప్రగతి భవన్ ను పేల్చాయాలని.. గెలిస్తే అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ చేస్తామంటూ.. రేవంత్ చేసిన కామెంట్లు కాక రేపుతున్నాయి. ఆ టాపిక్.. తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. మంత్రి కేటీఆర్ సైతం స్పందించాల్సి వచ్చింది. రేవంత్ మాటలకు ఫుల్ హైప్ రావడంతో కంగుతున్న కమలనాథులు.. రేపులో తామెక్కడ వెనకపడిపోతామనే భయంతో.. కొత్త సచివాలయ బిల్డింగ్ డోమ్ లను కూల్చేస్తామంటూ.. కాపీ క్యాట్ డైలాగు వదిలారు బండి సంజయ్. అది కూడా గట్టి రీసౌండే ఇచ్చింది. ఇక రేవంత్ రెడ్డి.. కేటీఆర్ అండ్ కో పై చేసిన భూదందా ఆరోపణలు సైతం అదే రేంజ్ లో రాజకీయ ప్రకంపణలు సృష్టిస్తోంది. ఇలా హాత్ సే హాత్ జోడోలో వరుస బాంబులు పేలుస్తూ.. తెలంగాణ పొలిటికల్ స్క్రీన్ మీద ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తున్నారు రేవంత్ రెడ్డి. రేవంత్ పాదయాత్రకు భారీగా ప్రజలు తరలివస్తుండటంతో కాంగ్రెస్ లో ఫుల్ జోష్ కనిపిస్తోంది.
రేవంత్ రెడ్డి యాత్ర ఇంతలా సక్సెస్ అవుతుండటం.. పార్టీలో కొందరికి ఇష్టం లేనట్టుంది. అందుకే అటువైపు కన్నెత్తి కూడా చూడట్లే. కనీసం ఫోటో సెషన్ కోసమైనా, మీడియా కవరేజ్ కోసమైనా.. అటువైపు కాలు కదపట్లే. ఆ కొందరు ఇంకెవరు?.. సీనియర్లే.
అవును, రేవంత్ పాదయాత్రకు చాలామంది సీనియర్లు ముఖం చాటేస్తున్నారు. మల్లు రవి, షబ్బీర్ అలీ లాంటి వాళ్లు కనిపిస్తున్నారే కానీ.. తామే హోల్ అండ్ సోల్ అని చెప్పుకునే సీనియర్ మోస్ట్ లీడర్ల హాజరు అస్సలు కనిపించట్లే. పార్టీ ఇంఛార్జ్ థాక్రే వచ్చారు కానీ, స్థానిక సీనియర్లు మాత్రం రేవంత్ తో కలిసి నడవడానికి మొహమాటం పడుతున్నట్టున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తనను ఎవరూ పిలవలేదంటున్నారు. వీహెచ్ అడ్రస్ లేరు. మహేశ్వర్ రెడ్డి ముచ్చట లేదు. కోమటిరెడ్డి, ఉత్తమ్ రెడ్డిలు పార్లమెంట్ పేరు చెప్పుకుని గాయబ్ అయ్యారు. భట్టి విక్రమార్క అసెంబ్లీ ఉందన్నారు. మధు యాష్కీ మస్కా కొట్టేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో యాత్ర జరుగుతున్నా.. కొండా ఫ్యామిలీ అడ్రస్ లేదు. ఇలా.. సో కాల్డ్ సీనియర్లంతా హాత్ సే హాత్ జోడో యాత్రలో కదం కదం కదిపేందుకు ఎందుకో సంసయిస్తున్నట్టున్నారు. సీతక్క మాత్రం అన్న కోసం చమటోడుస్తున్నారు.
అదేమీ రేవంత్ రెడ్డి సొంత పాదయాత్ర కాదు. పార్టీ కార్యక్రమం. అధిష్టానం నిర్దేశించిన ప్రొగ్రామ్. హాత్ సే హాత్ జోడో. ఆ యాత్ర ప్రజలను, కాంగ్రెస్ ను ‘జోడో’ చేస్తోంది కానీ.. కాంగ్రెస్ సీనియర్లను మాత్రం కలపలేకపోతోందనే విమర్శైతే వినిపిస్తోంది. అయితే, యాత్ర ప్రారంభమై వారమే అవుతోంది కాబట్టి.. తొందరేముంది.. ముందుముందు నేతలంతా వస్తారులే.. వారి వారి నియోజకవర్గాల్లో రేవంత్ ను కలుస్తారులే.. అంటున్నారు కాంగ్రెస్ వాదులు.