పార్లమెంట్ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. ఢిల్లీలో బాగా హడావుడి ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్నిపార్టీల ప్రతినిధులు హస్తినలో అందుబాటులో ఉన్నారు. ఇంకేం. ఇదే కరెక్ట్ సమయం అంటూ.. తనకు జరిగిన అన్యాయాన్ని ఢిల్లీ వీధుల్లో వినిపిస్తున్నారు శేజల్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వేధింపులను పార్లమెంట్ ముందు ఎండగడుతున్నారు.
ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వివాదం మరోసారి ఢిల్లీకి చేరింది. పోలీస్ స్టేషన్లో దుర్గం చిన్నయ్యపై కేసు నమోదు చేయమంటే.. తిరిగి తనపైనే కేసులు పెడతామని బెదిరిస్తున్నారని బాధితురాలు శేజల్ ఆరోపించారు. అందుకే ఢిల్లీలోని పార్లమెంట్ భవనం దగ్గర నిరసన చేపట్టానని ఆమె తెలిపారు.
సొంత రాష్ట్రంలో మహిళకు న్యాయం చేయని బీఆర్ఎస్ నేతలు మణిపూర్ ఘటనపై రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దుర్గం చిన్నయ్యపై కేసు నమోదు చేసే వరకూ పోరాటం కొనసాగిస్తానని శేజల్ చెప్పారు.