CBI: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు మరో షాక్ తగిలింది. తనను లైంగికంగా వేధించాడంటూ గత కొద్ది రోజులుగా దుర్గం చిన్నయ్యకు వ్యతిరేకంగా ఆరోపణలు చేస్తోన్న ఆరిజిన్ డైరీ సీఈవో శేజల్.. తాజాగా సీబీఐని ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వ్యవహారంపై దర్యాప్తు చేసి.. తనకు న్యాయం చేయాలని సీబీఐకి విజ్ఞప్తి చేసింది శేజల్. తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేసింది.
దాదాపు పది రోజులకు పైగా ఢిల్లీలోనే ఉంటున్నారు ఆరిజన్ డెయిరీ ఎండీ శేజల్. ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ధర్నాకు దిగారు. తనకు న్యాయం జరగడం లేదనే ఆవేనదతో న్యూఢిల్లీలోనే ఆత్మాహత్యాయత్నం చేసింది శేజల్. వెంటనే స్థానికులు గుర్తించి ఆసుపత్రిలో చేర్పించారు. ఇటీవలే ఆమె ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు.
దుర్గం చిన్నయ్యపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే మహిళ కమిషన్కు కూడా ఫిర్యాదు చేసింది శేజల్. ఆరిజన్ డైరీ సీఈవో శేజల్ ఫిర్యాదుతో జాతీయ మహిళా కమిషన్ విచారణకు ఆదేశించింది. ఈ మేరకు తెలంగాణ డీజీపీకి లేఖ రాసింది. 15 రోజుల్లో విచారణ నివేదికను పంపాలని ఆదేశించింది జాతీయ మహిళా కమిషన్. తాజాగా, సీబీఐకి సైతం ఫిర్యాదు చేసి.. తనను వేధించిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యను వదిలేదేలేదంటోంది బాధితురాలు శేజల్.