Hyderabad: సికింద్రాబాద్ మినిస్టర్ రోడ్డులో జరిగిన అగ్నిప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. మంటల్లో చిక్కుకొని ఇద్దరు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. భవనంలోకి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో అధికారులు డ్రోన్ కెమెరాల సహాయంతో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి మృతదేహాలను గుర్తించారు. మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి.
గురువారం ఉదయం మంటలు చెలరేగిన వెంటనే ఫైర్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. భవనంలో చిక్కుకున్న నలుగురిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అయితే బీహార్కు చెందిన ముగ్గురు కూలీలు జునైద్, వసీం, జహీర్ల ఆచూకీ మాత్రం గల్లంతైంది. అధికారులు వాళ్ల సెల్ఫోన్ సిగ్నల్స్ను ట్రాక్ చేసి మంటలు చెలరేగిన భవనంలో ఉన్నట్లు గుర్తించారు.
భవనం లోపలి పరిస్థితిపై ఇంకా స్పష్టత రాలేదని అధికారులు తెలిపారు. డ్రోన్ కెమెరాల ద్వారా భవనంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నామని వెల్లడించారు. భవనంలోకి వెళ్లే పరిస్థితి లేదన్నారు. భవనం కూల్చివేతపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటామని వివరించారు.