Secunderabad : సికింద్రాబాద్ దక్కన్ మాల్లో గురువారం జరిగిన అగ్నిప్రమాదం తర్వాత ముగ్గరి ఆచూకీ లభ్యంకాలేదు. మంటల్లో చిక్కుకుని కనిపించకుండాపోయిన వసీం, జునైద్, జహీర్ సజీవదహనమయ్యారు. వీరి మృతదేహాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇవి గుర్తుపట్టలేని విధంగా కాలిపోయి బూడిద అయినట్లు తెలుస్తోంది. ఎముకలు, టీత్ పరీక్ష ద్వారానే మృతులను గుర్తించే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు.
గురువారం అగ్నిప్రమాదం సంభవించినప్పుడు లోపల చిక్కుకున్న నలుగురిని సిబ్బంది కాపాడారు. అయితే వసీం, జునైద్, జహీర్ మాత్రం షెటర్లు మూసేందుకు మంటల్లోనే లోపలికి వెళ్లారు. మంటలను ఆర్పే క్రమంలో అస్వస్థతకు గురైన అగ్నిమాపక సిబ్బంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వారు నిమ్స్ లో చికిత్స పొందుతున్నారు.
అగ్నిప్రమాద ఘటనపై కేసు నమోదైంది. కానిస్టేబుల్ బలప్రసాద్ ఫిర్యాదుతో భవన యజమానులు మహమ్మద్ ఓవైసీ, ఎంఏ రహీంపై పోలీసులు కేసు నమోదు చేశారు. రెసిడెన్షియల్ భవనాన్ని కమర్షియల్ స్పేస్ గా మార్చారని యజమానులపై అభియోగాలు నమోదు చేశారు. భవనానికి సెట్ బ్యాక్ లేకపోవడం, నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
అగ్నిప్రమాదం జరిగిన దక్కన్ మాల్ భవనం ఏ క్షణంలోనైనా కూలిపోయే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. మంటల తీవ్రతకు భవనం పిల్లర్లు దెబ్బతిన్నాయి. మరోవైపు దక్కన్ మాల్లో మంటలు ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదు. భవనం వద్దకు ఎవరినీ అనుమతించడం లేదు. పరిసర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
దక్కన్ మాల్ భవనాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సందర్శించారు. అగ్నిప్రమాద వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మంటల్లో కాలిపోయిన భవనాన్ని జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులు పరిశీలించారు. భవనంలో పూర్తిగా గాలించిన తర్వాత కూల్చివేయాలని నిర్ణయించారు.