IT Raids : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థులు, నేతల ఇళ్లు, ఫామ్హౌస్లలో ఇన్కమ్ టాక్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, బడంగ్పేట్ మేయర్ చిగురింత పారిజాతా నర్సింహారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తోడల్లుడు గిరిధర్రెడ్డి ఇళ్లు, ఆఫీసుల్లో ఐటీ అధికారులు ఏకకాలంలో సోదాలు జరిపారు. నిన్న అర్ధరాత్రి వరకు జరిగిన సోదాల్లో కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకొని వారి వద్ద సంతకాలు తీసుకున్నారు. పారిజాతను ఈ నెల 6న విచారణకు హాజరవ్వాలని నోటీసులు ఇచ్చారు అధికారులు.
దాదాపు 32 మంది అధికారులతో కూడిన బృందాలు.. హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోని 14 ప్రాంతాల్లో సీఆర్పీఎఫ్ బలగాల బందోబస్తు మధ్య ఈ సోదాలు నిర్వహించారు. సోదాల్లో బ్యాంకు డాక్యుమెంట్స్, కంపెనీలు, సంస్థలకు చెందిన రికార్డులు, కంప్యూటర్ హార్డ్డిస్క్లను అధికారులు సీజ్ చేశారు.
లక్ష్మారెడ్డి ఇల్లు, ఫామ్హౌస్, కేఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్లో ఐటీ అధికారులు తనిఖీలు చేశారు. నెల రోజుల ట్రాన్సాక్షన్స్ గురించి వివరాలు సేకరించినట్లు సమాచారం. ఇక ఐటీ అధికారులు వచ్చిన సమయంలో పారిజాత తిరుపతికి వెళ్లగా.. ఆమె భర్త నర్సింహా రెడ్డి ఢిల్లీలో ఉన్నారు. ఎక్కడున్నా ఇంటికి రావాలని ఇరువురిని ఆదేశించారు. దీంతో నర్సింహారెడ్డి ఢిల్లీ నుంచి సాయంత్రం సమయంలో ఇంటికి చేరుకున్నారు. ఆయనను ఐదుగురు సభ్యుల టీమ్ విచారించింది. మరోవైపు ఐటీ సోదాలపై బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పారిజాత నర్సింహా రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తన ఎదుగుదలను తట్టుకోలేక కుట్రపూరితంగా ఐటీ దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ, బీఆర్ఎస్ ఓటమి భయంతోనే కాంగ్రెస్ నేతలను టార్గెట్ చేశారని వాపోయారు.
కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తోడల్లుడు గిరిధర్రెడ్డికి సంబంధించి.. కోకాపేట- హిడెన్ గార్డెన్స్లోని నివాసంలో అధికారులు తనిఖీలు చేశారు. గిరిధర్ రెడ్డి, కోమటిరెడ్డి భాగస్వాములుగా ఉన్న పలు కంపెనీల ఆఫీసుల్లో సోదాలు జరిపారు. బాలాపూర్కు చెందిన బీఆర్ఎస్ లీడర్ లక్ష్మారెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేసేందుకు వెళ్లారు.
శుక్రవారం ఉదయం కూడా ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. నగరంలో, నగర శివారులలో కాంగ్రెస్ నేతలకు సంబంధించిన 18 ప్రాంతాల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. విప్సర్ వ్యాలీలో ఉన్న సీనియర్ నేత జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డి ఇంటిలో ఐటీ దాడులు జరుగుతున్నాయి. మాదాపూర్ లోని కేఎల్ఆర్(కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి) హెడ్ క్వార్టర్స్ లోనూ తనిఖీలు జరుగుతున్నాయి.