IT Raids Telangana(Today breaking news in Telangana): అధికార బీఆర్ఎస్ పార్టీ నేతల ఇళ్లు, కార్యాలయాల్లో వరుసగా రెండో రోజు ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార పార్టీ నేతలే లక్ష్యంగా జరుగుతున్న ఐటీ శాఖ దాడులు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి నివాసాల్లో ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి.
మైలాన్ డిజిటల్ టెక్నాలజీలో కొత్త ప్రభాకర్ రెడ్డి, మర్రి జనార్థన్ రెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి భాగస్వాములుగా ఉన్నట్లు ఐటీ అధికారులు గుర్తించారు. ముగ్గురు నేతలు కలిసి పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నట్లు ఐటీ గుర్తించింది. నేతల సతీమణులు, కుటుంబ సభ్యులు డైరెక్టర్స్గా ఉన్న కంపెనీలపై ఐటీ ఫోకస్ చేసింది. బ్యాంకు లాకర్స్ను సైతం ఓపెన్ చేసిన ఐటీ అధికారులు పలు కీలక పత్రాలు, సమాచారం సేకరించారు. ఇన్కం టాక్స్ చెల్లింపుల అవకతవకలపైనా ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు.
హైదరాబాద్ కొత్తపేట్ గ్రీన్ హిల్స్ కాలనీలో ఉన్న భువనగిరి ఎ్మమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి ఇల్లు , ఆఫీస్లలోనూ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. తీర్థ గ్రూప్ పేరుతో ఫైళ్ల మైనింగ్, రియల్ ఎస్టేట్, లిథియం బ్యాటరీలు, సోలార్ ఎనర్జీ వ్యాపారాలు చేస్తున్నారు. హైదరాబాద్, కర్ణాటకలలో పలు కమర్షియల్, రెసిడెన్షియల్ ప్రాజెక్టులను తీర్థ గ్రూప్ పూర్తి చేసింది. హిల్ ల్యాండ్ టెక్నాలజీస్ కంపెనీ, మెయిన్ ల్యాండ్ డిజిటల్ టెక్నాలజీస్లోనూ ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఈ రెండు కంపెనీలకు పైళ్ల శేఖర్ రెడ్డి భార్య వనితా.. డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు
రెండు రోజులుగా జరుగుతున్న ఐటీ దాడులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి స్పందించారు. వ్యాపారం చేయడం తప్పా అని ప్రశ్నించారు. ఐటీ సోదాలకి భయపడేదే లేదన్నారు. భూములు అమ్మడం, కొనడం తప్పెలా అవుతుందో చెప్పాలన్నారు. ఇప్పటి వరకు తాను 150 కోట్ల టాక్స్ కట్టానని.. సోదాల సమయంలో ఐటీ అధికారులు ప్రవర్తించిన తీరు బాగోలేదన్నారు మర్రి జనార్థన్రెడ్డి.