BJP : తెలంగాణలో బీజేపీ ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లోనూ సింగిల్ డిజిట్ కే పరిమితమవుతోంది. 2014 ఎన్నికల్లో 5 సీట్లు మాత్రమే దక్కించుకుంది. కానీ 2018 ఎన్నికల్లో మాత్రం కాషాయ పార్టీకి ఒకే ఒక్క సీటు దక్కింది. అప్పుడు గోషామహల్ లో రాజాసింగ్ గెలిచారు. ఆ తర్వాత ఉపఎన్నికల్లో దుబ్బాక నుంచి రఘునందన్ రావు, హుజురాబాద్ నుంచి ఈటల రాజేందర్ విజయం సాధించడంతో బీజేపీ బలం 3 కి చేరింది.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిన తర్వాత 4 నెలలకు జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మాత్రం కాషాయ పార్టీ సత్తా చాటింది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ , సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానాలను కమలం పార్టీ కైవసం చేసుకుంది. ఎమ్మెల్యే ఒక్కరే ఉన్నా.. ఎంపీలు నలుగురు గెలవడంతో ఆ పార్టీలో జోష్ వచ్చింది. ఆ తర్వాత జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో సత్తాచాటింది. మునుగోడు ఉపఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ హోరాహోరీగా పోటీ పడ్డాయి. ఆ ఉపఎన్నికలో కాంగ్రెస్ కు కనీసం డిపాజిట్ కూడా రాలేదు.
తాజా ఎన్నికల్లో బీజేపీ 8 స్థానాలు దక్కించుకుంది. 2018 ఎన్నికల కంటే 7 సీట్లు పెరిగాయి. కానీ బీజేపీలో పెద్ద నేతలు ఓటమిపాలయ్యారు. కరీంనగర్ లో బండి సంజయ్, హుజురాబాద్ , గజ్వేల్ లో ఈటల రాజేందర్, దుబ్బాకలో రఘునందన్ రావు ఓడిపోయారు. బీజేపీకి గట్టి పట్టున్న గ్రేటర్ హైదరాబాద్ లో ఒక్కసీటు మాత్రమే దక్కింది. దక్షిణ తెలంగాణ కాషాయ ప్రభావం కనిపించలేదు. ఉత్తర తెలంగాణలో మాత్రం బీజేపీ ప్రభావం బాగా ఉంది.
సిర్పూర్ లో హరీశ్ బాబు, కామారెడ్డిలో వెంకటరమణారెడ్డి, ముథోల్ లో రామ్ రావ్ పవార్, ఆదిలాబాద్ లో పాయల్ శంకర్ విజయ ఢంకా మోగించారు. ఆర్మూర్ లో పైడి రాకేశ్ రెడ్డి, నిమాజాబాద్ అర్బన్ లో ధనపాల్, నిర్మల్ లో మహేశ్వర్ రెడ్డి గెలిచారు. బీజేపీకి 7 స్థానాలు ఉత్తర తెలంగాణలోనే వచ్చాయి. గత లోక్ సభ ఎన్నికల్లో అక్కడే 3 ఎంపీ సీట్లు గెలిచింది బీజేపీ. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ పట్టు నిలుపుకుంది.
గ్రేటర్ హైదరాబాద్ లో గోషామహల్ నుంచి రాజాసింగ్ ఒక్కరే మళ్లీ గెలిచారు. హ్యాట్రిక్ విజయాలతో తన బలాన్ని మరోసారి చూపించారు. బీజేపీ నుంచి బహిష్కరణకు గురైన రాజాసింగ్ మరో పార్టీలో చేరలేదు. చివరికి ఎన్నికలకు ముందు బీజేపీ సస్పెన్షన్ ను రద్దు చేసి తిరిగి పార్టీలో చేర్చుకుని ఆయనకు టిక్కెట్ ఇచ్చింది.
2018 ఎన్నికల్లో బీజేపీకి కేవలం 7 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. తాజా ఎన్నికల్లో బీజేపీకి దాదాపు 14 శాతం ఓట్లు వచ్చాయి. అంటే 7 శాతం ఓట్లు పెరిగాయి.