కాంగ్రెస్ పార్టీ టికెట్ల కోసం భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటికే పరిశీలన ప్రక్రియ మొదలైంది. ఒక్కో నియోజకవర్గం నుంచి ప్రధానం ముగ్గురికి పైగానే ఆశావాహులు ఉన్నారు. ఇక ఇల్లందు సీటు కోసం ఏకంగా 30 మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారని తెలుస్తోంది.
ఎమ్మెల్యే టిక్కెట్ల కోసం వెయ్యికి పైగా అప్లికేషన్స్ వచ్చాయి. కొందరు సీనియర్ నేతలు టిక్కెట్ కోసం దరఖాస్తులు చేసుకోలేదు. కానీ తమ వారసులతో చేయించారు. పలువురు ముఖ్య నేతలు ఇతర నియోజకవర్గాల నుంచి టికెట్లు ఆశిస్తున్న పరిస్థితి ఉంది. 50 నుంచి 70కి పైగా నియోజకవర్గాల్లో పెద్దగా ఇబ్బందులు లేనప్పటికీ… మిగతా స్థానాల్లో తీవ్రమైన పోటీ ఉంది.
ములుగు టికెట్ కోసం సీతక్క దరఖాస్తు చేసుకున్నారు. ఆమె కుమారుడు సూర్యం పినపాక టికెట్ కోసం అప్లై చేశారు. నాగార్జునసాగర్ టిక్కెట్ కోసం జానారెడ్డి ఇద్దరు కుమారులు రఘువీర్రెడ్డి, జైవీర్ రెడ్డి పోటీ పడుతున్నారు.అలాగే మిర్యాలగూడ టికెట్ కోసం రఘువీర్రెడ్డి మరో దరఖాస్తు చేయడం ఆసక్తిని రేపుతోంది. ముషీరాబాద్ టికెట్ కోసం అంజన్కుమార్ యాదవ్ కుమారుడు అనిల్కుమార్ యాదవ్ పోటీ పడుతున్నారు. ఎల్బీనగర్ సీటు మధుయాష్కీగౌడ్ కోరుతున్నారు. జనగామ టికెట్ కోసం పొన్నాల లక్ష్మయ్య, కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మధ్య పోటీ నెలకొంది.
తెలంగాణలోని చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ టిక్కెట్ కోసం ఇద్దర కంటే ఎక్కువ మంది ఆశిస్తున్నారు. కొడంగల్, మంథని నియోజకవర్గాల నుంచి మాత్రం ఒక్క దరఖాస్తు మాత్రమే వచ్చింది. ఆయా స్థానాల నుంచి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు పోటీ చేయనున్నారు. పార్టీలోని సీనియర్ నేతలు జానారెడ్డి, వి.హనుమంతరావు, గీతారెడ్డి, రేణుకా చౌదరితోపాటు కొందరు కీలక నేతలు ఎమ్మెల్యే టిక్కెట్ కోసం దరఖాస్తు చేసుకోలేదు. మరి ఈ నేతలు ఎంపీ ఎన్నికల బరిలో నిలవాలనుకుంటున్నారా? అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటున్నారా?