Schools Reopen in Telangana State from Today: రేపటి నుంచి తెలంగాణలో బుధవారం నుంచి పాఠశాలలు పున:ప్రారంభం కానున్నాయి. నేటితో వేసవి సెలవులు ముగియడంతో జూన్ 12 నుంచి తరగతులను నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో విద్యా సంవత్సరం ప్రారంభం కానున్నది. ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలను ప్రోత్సహించుటకు ఇప్పటికే బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. గతవారం నుంచి.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బడిబాట కార్యక్రమం ప్రారంభమైంది. అందులో భాగంగానే జూన్ 12న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్కూళ్లను పున:ప్రారంభించనున్నారు.
కాగా, ఈ ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో తరగతులను ఉదయం 9 గంటలకే ప్రారంభించనున్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో బోధన 8 గంటలకకే ప్రారంభమవుతున్న నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో బోధన, డ్రాపౌట్ల సంఖ్యను తగ్గించేందుకు విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకున్నది. మరోవైపు కొత్త విద్యా సంవత్సరంలో ప్రతి ప్రభుత్వ పాఠశాలలో కనీసం 90 శాతం మంది విద్యార్థులు హాజరయ్యేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ స్కూళ్లలో ప్రతిరోజూ కనీసం 90 శాతం మంది విద్యార్థులు హాజరు కావాల్సిందేనని పేర్కొన్నారు. ఇందుకోసం పేరెంట్స్ కమిటీలు, విద్యా కమిటీలు, స్థానిక స్వచ్ఛంద సంస్థలు, ఉపాధ్యాలను భాగస్వామ్యులను చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే.. 2024-25 విద్యా సంతవ్సరానికి సంబంధించిన క్యాలెండర్ ను తెలంగాణ అధికారులు ఇప్పటికే విడుదల చేసిన విషయం తెలిసిందే. జూన్ 12 నుంచి రాష్ట్రంలో పాఠశాలలు పున:ప్రారంభమై వచ్చే ఏడాది ఏప్రిల్ 23 వరకు కొనసాగనున్నాయని పేర్కొన్నారు. అప్పర్ ప్రైమరీ పాఠశాలలు.. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు నడవనున్నాయని తెలిపారు. ఉన్నత పాఠశాలలు.. ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు నడవనున్నాయని తెలిపిన విషయం తెలిసిందే.
Also Read: హైదరాబాద్లో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం..
అక్టోబర్ 2 నుంచి 14 వరకు దసరా సెలవులు, డిసెంబర్ 23 నుంచి 27 వరకు క్రిస్మస్ సెలవులు, వచ్చే సంవత్సరం జనవరి 13 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు, ఫిబ్రవరి 28 లోపు పదో తరగతి ఫ్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు అందులో తెలిపారు. అదేవిధంగా మార్చిలో పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.