శంషాబాద్ లో విచిత్ర ఘటన వెలుగుచూసింది. రంగారెడ్డి జిల్లా కొత్తూరు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు వింతగా ప్రవర్తించారు. పాఠశాలకు సమీపంలో ఉన్న పాన్ డబ్బాల యజమానులు కొద్దిరోజులుగా చాక్లెట్లను పంపిణీ చేస్తున్నారు. ఆ చాక్లెట్లు తిన్న విిద్యార్థులు తరగతిగదిలో మత్తులోకి జారడంతో పాటు.. వింతగా ప్రవర్తించడాన్ని ఉపాధ్యాయులు గమనించారు. ఏం జరిగిందని విద్యార్థుల్ని ప్రశ్నించగా.. అసలు విషయం వెలుగుచూసింది.
పాన్ డబ్బాల వద్ద చాక్లెట్లు తినడం వల్లే విద్యార్థులు వింతగా ప్రవర్తించినట్లు గుర్తించారు. వెంటనే పాఠశాల ఉపాధ్యాయులు పోలీసులకు పాన్ డబ్బాల యజమానులపై ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల దర్యాప్తులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. పాఠశాల సమీపంలో ఓ వ్యక్తి పాన్షాప్ నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే విద్యార్థులకు గంజాయి కలిపిన మత్తు చాకెట్లు విక్రయిస్తున్నట్లు ఎస్వోటి పోలీసులు గుర్తించారు. నిందితుడు వద్ద నుంచి రూ. 1.30 లక్షలు విలువైన 42 ప్యాకెట్లు (8 కిలోల చాక్లెట్లు) పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి మరో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.
బయటి ఫుడ్ తినొద్దని పిల్లలకు ఎప్పుడూ చెప్తూ ఉంటామని, అయినప్పటికీ చాక్లెట్స్ అనే సరికి వాటిని తినకుండా ఉండలేకపోతున్నారని టీచర్లు చెబుతున్నారు. మీ పిల్లలకు కూడా విపరీతంగా చాక్లెట్లు తినే అలవాటు ఉంటే.. వెంటనే ఆ అలవాటును మాన్పించడం మంచిది.