CM KCR : నాడు 16 మంది ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు..
గ్రూప్ -1 పరీక్షా పత్రాలు లీక్..
గ్రామాల్లో ఎలిమెంటరీ స్కూళ్లను మూసేసిన వైనం..
తెలంగాణలో విద్యావ్యవస్థ అత్యంత దారుణంగా మారిందని మేధావులు వ్యాఖ్యానిస్తున్నారు. భావి తెలంగాణ విద్యార్థుల బంగారు భవిష్యత్ ను సీఎం కేసీఆర్ పట్టించుకోలేదనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా విద్యావ్యవస్థ బోర్డులన్నీ అవినీతి అక్రమాలతో నిండి పోయాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలు రెండుసార్లు రద్దు చేయడమే అందుకు నిదర్శనమని అంటున్నారు.
పగలు, రాత్రిళ్లు ఏళ్ల తరబడి చదివిన అభ్యర్థులు గ్రూప్ -1 పరీక్ష రాసి, ర్యాంకు కోసం చూసేలోపు, వాటిని రద్దు చేయడం, పరీక్షా పేపర్లు లీక్ చేయడం ఇవన్నీ చూసి హతాశుయులవుతున్నారు. టీఎస్పీఎస్సీ ని (TSPSC) ప్రక్షాళన చేయలేదు. లీకేజీలు ఆగకపోవడం, అది కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యమే అంటున్నారు. ఉన్నత స్థాయిలోనే లోపాలున్నాయనే విమర్శలు అధికమయ్యాయి.
2019లో ఇంటర్ బోర్డులో అవకతవకల కారణంగా 16మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం సంచలనం సృష్టించింది. బోర్డులో అవినీతి అధికారుల కారణంగా పాస్ కావాల్సిన విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ కావాల్సినవాళ్లు పాస్ అయ్యారు. దీంతో బ్రహ్మాండమైన ర్యాంక్ వస్తుందని భావించిన విద్యార్థులు హతాశుయులై చిన్నవయసులోనే ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
ఇది తెలంగాణ రాష్ట్రాన్ని ఊపేసింది. కేసీఆర్ ప్రభుత్వానికి మాయని మచ్చగా మిలిగింది. ఒక ఘటన జరిగిన తర్వాత మార్పు రావాలి. కానీ అంతకుమించి.. చేసుకుపోతున్నారు. తెలంగాణలో విద్యావ్యవస్థ భ్రష్టుపట్టిందనడానికి గ్రూప్- 1 పరీక్షలు, ఇంటర్ బోర్డు నిర్వాకమే నిదర్శనమని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ఇప్పటికే ఉన్న దాదాపు 40 వేల టీచర్ల పోస్టులను బీఆర్ఎస్ సర్కార్ భర్తీ చేయలేదు. దీంతో సున్నా హాజరు అంటూ ఆ బడులను క్రమక్రమంగా ఏడాదికేడాది మూసేస్తున్నారు. టీచర్లు లేకపోవడం వల్లే పిల్లల్ని పంపడం లేదని తల్లిదండ్రులు అంటున్నారు. అంతేకాదు కిక్కిరిసిన ప్రైవేటు బస్సుల్లో వేరే చోటుకి పంపిస్తున్నామని వాపోతున్నారు. అలా చదివించలేని వాళ్లు తమ పిల్లల్ని బర్రెలు కాయడానికి లేదా కూలి పనులకి పంపిస్తున్నారని మేధావులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే వందల సంఖ్యల్లో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఇంకా హైస్కూళ్లను మూసివేస్తూ బీఆర్ఎస్ సర్కార్ వెళ్లింది. వీటి స్థానంలో గురుకుల పాఠశాలలు అని పెట్టినా సత్ఫలితాలను ఇవ్వలేదు.
ఈ విషయంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రూప్ -1 పరీక్షల నిగ్గు తేల్చుతామని అన్నారు. విద్యావ్యవస్థను ప్రక్షాళన చేస్తామని తెలిపారు.