6 People Died in SB Organics Factory Fire Accident: సంగారెడ్డి జిల్లాలో ఉన్న ఎస్బీ ఆర్గానిక్స్ ఫ్యాక్టరీలో జరిగిన అగ్నిప్రమాద మృతుల సంఖ్య ఆరుకు చేరింది. బుధవారం (ఏప్రిల్ 3) సాయంత్రం 4 గంటలకు జరిగిన ఈ అగ్నిప్రమాదంలో రెండు రియాక్టర్లు పేలడంతో.. ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. గురువారం ఉదయం ప్రమాదం జరిగిన ప్రాంతంలో మరో మృతదేహం లభ్యమవ్వడంతో.. మృతుల సంఖ్య ఆరుకు చేరింది. కాగా.. బుధవారం మొత్తం 60 మంది ఉద్యోగులు విధులకు హాజరవ్వగా.. 30 మంది ఉద్యోగుల ఆచూకీ మాత్రమే లభ్యమైంది. మిగతా 30 మంది ఆచూకీ కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.
కాగా.. మృతుల్లో కంపెనీ డైరెక్టర్ రవివర్మ (38) కూడా ఉన్నారు. గురువారం ఉదయం కనిపించిన మృతదేహాన్ని హత్నూర మండలం కొన్యాలకు చెందిన వడ్డె రమేశ్ (38)గా గుర్తించారు. నిన్న మృతి చెందిన వారు తమిళనాడుకు చెందిన దయానంద్ (48), విజయవాడకు చెందిన సుబ్రహ్మణ్యం (36), మధ్యప్రదేశ్ కు చెందిన సురేష్ పాల్ (54), చందాపూర్ కు చెందిన చాకలి విష్ణు (35)గా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా.. ప్రమాదంలో గాయపడిన 16 మందిని సంగారెడ్డి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు తరలించి చికిత్స చేస్తున్నారు.
Also Read: కొమురం భీం జిల్లాలో ఏనుగు బీభత్సం.. 24 గంటల్లో ఇద్దరు రైతులు మృతి
రియాక్టర్ పేలుడు తీవ్రతకు సమీపంలోని నిర్మాణాలు కూలిపోయాయి. ఈ ఘటనలో మొత్తం 100 కోట్ల రూపాయల ఆస్తినష్టం సంభవించినట్టు పోలీసులు అంచనా వేశారు. శకలాలను తొలగిస్తేకానీ మృతుల సంఖ్యపై స్పష్టత వచ్చే అవకాశంలేదని భావిస్తున్నారు. ఈ కంపెనీ పక్కనే ఉన్న స్టీల్ ఫ్యాక్టరీ కూడా పూర్తిగా దగ్ధం కావడంతో 50 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని ఫ్యాక్టరీ యాజమాన్యం పేర్కొంది.