Karimnagar : గ్రామాల అభివృద్ధే తమ లక్ష్యమని గొప్పగా ప్రకటించింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. తీరా చూస్తే సారు సర్కారు గద్దె దిగే సమయానికి ఒక్కో గ్రామ పంచాయతీ పరిధిలో చెల్లించాల్సిన లక్షల రూపాయల్లో బిల్లులను పెండింగ్లో ఉంది. దీంతో అప్పులు తీసుకొచ్చి మరీ గ్రామాభివృద్ధి చేసిన సర్పంచ్లు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. మరో నెల రోజుల్లో పదవి కాలం ముగుస్తుండటంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గత 18 నెలలుగా బిల్లులు రాకపోవడంతో… గ్రామ అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతుందంటున్నారు సర్పంచ్లు. ఇప్పటికే పలువురు సర్పంచ్లు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. అయినా కానీ గత బీఆర్ఎస్ సర్కార్ పట్టించుకున్న పాపాన పోలేదు.
ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గ్రామ పంచాయతీ బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. స్థానికంగా నిధులు లేనప్పటికీ… సర్పంచ్లు పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. నిధులు విడుదల కాకపోవడంతో కనీసం సిబ్బందికి కూడా వేతనాలు చెల్లించే పరిస్థితి లేదంటున్నారు వారు. ఒకవేళా నిధులు విడుదలైనా… విద్యుత్ బిల్లుల కోసం వినియోగిస్తున్నారని చెబుతున్నారు.
గతంలో అప్పుల బాధ భరించలేక.. సర్పంచ్లు ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. అంతేకాదు పదవి నుంచి తప్పుకున్న వారు కూడా ఉన్నారు. ప్రస్తుతం సర్పంచ్ల పదవి కాలం జనవరి 31తో ముగుస్తుంది. కానీ ఇప్పటికీ బిల్లులు మంజూరు కాలేదు. తాము అప్పులు తెచ్చి అభివృద్ధి పనులు చేశామని.. నిధులు మంజూరు చేయాలని కోరుతున్నారు.
మేడిపల్లి మండలం గోవిందరం సర్పంచ్ మధుకర్ దాదాపు 18 లక్షల వరకు అభివృద్ధి పనుల కోసం ఖర్చు చేశారు. కానీ నిధులు మంజూరు చేయలేదు. ఆయన అధికారులు చుట్టు తిరిగిన లాభం లేకుండా పోయింది. అదే విధంగా సైదాపూర్ మండలం ఆకునూరు గ్రామ సర్పంచ్ రమణారెడ్డి సుమారుగా 49 లక్షల విలువ చేసే పనులు చేశారు. ఆ నిధులు కూడా మంజూరు చేయలేదు. చాలా గ్రామాల్లో నూతన గ్రామ పంచాయతీలు నిర్మిస్తున్నారు. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయకున్నా స్వంత డబ్బులు పెట్టుకొని పనులు చేస్తున్నారు నేతలు.
నిధులు మంజూరు కాకపోవడంతో ఆర్థికంగా చితికిపోతున్నామని సర్పంచ్లు చెబుతున్నారు. లక్షల రూపాయాలు పెండింగ్లో ఉన్నాయని ఆవేదన చెందుతున్నారు. బీఆర్ఎస్ సర్కార్ తమను నిలువునా ముంచిందని.. ఇప్పటికైనా వెంటనే పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలని కోరుతున్నారు.
.
.