Sankranti Buses: సంక్రాంతి పండుగ వచ్చేస్తుంది. మరో నాలుగు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలవ్వనుంది. సంక్రాంతి అనగానే గుర్తొచ్చేవి గోదావరి జిల్లాలే. రంగురంగుల రంగవల్లులు, కోడిపందేలు, పిండివంటలు, అతిథి మర్యాదల్లో ఏమాత్రం తగ్గరు గోదారోళ్లు. సంక్రాంతి వచ్చిందంటే.. గోదావరి జిల్లాల ప్రజలు ఎక్కడున్నా.. పండక్కి సొంతూరికి చేరుకుంటారు. సంక్రాంతి సమయంలో ప్రయాణికుల రద్దీ ఊహించిన దానికంటే ఎక్కువగానే ఉంటుంది.
ఇప్పటికే రైళ్లన్నీ ఫుల్ అయ్యాయి. రెగ్యులర్ ట్రైన్స్ తో పాటు.. స్పెషల్ ట్రైన్లలో కూడా చాంతాడంత వెయిటింగ్ లిస్ట్ దర్శనమిస్తుంది. పోనీ బస్సుకు పోదామంటే.. ఏకంగా ఆస్తులే అడుగుతున్నారు. హైదరాబాద్ నుంచి కాకినాడ, రాజమండ్రి, భీమవరం వెళ్లాలంటే.. ప్రైవేట్ ట్రావెల్స్ మినిమం 4 నుంచి 5 వేల రూపాయలు వసూలు చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో సంక్రాంతి ప్రయాణికులకు ఏపీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది.
సంక్రాంతికి హైదరాబాద్ నుంచి కోనసీమకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. హైదరాబాద్ నుంచి అమలాపురంకు 57 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు అమలాపురం రీజనల్ మేనేజర్ నాగేశ్వరరావు వెల్లడించారు. 10,11,12,13 తేదీల్లో స్పెషల్ బస్సులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. రెగ్యులర్ గా 19 బస్సులుండగా.. అదనంగా ఈ బస్సులను ఏర్పాటు చేశామన్నారు. ప్రయాణికుల రద్దీని బట్టి బస్సుల సంఖ్యను మరింత పెంచుతామని తెలిపారు. హైదరాబాద్ నుంచి రావడానికి, తిరిగి వెళ్లడానికి ఒకేసారి రిజర్వేషన్ చేయించుకున్న వారికి 10 శాతం రాయితీ కూడా ఉంటుందని తెలిపారు. ఈ డిస్కౌంట్.. హైదరాబాద్ నుంచి ఏపీలో ఏ ప్రాంతానికి రిజర్వేషన్ చేయించుకున్నా ఉంటుందని తెలిపారు. అమలాపురం నుంచి రాజమండ్రి, కాకినాడ, విశాఖకు కూడా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.