– ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో సంధ్యా శ్రీధర్ రావు
– ఆమధ్య ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వినిపించిన పేరు
– కొత్తగా పేదల గుడిసెల తొలగింపునకు ప్రయత్నం
– ప్రభుత్వ భూమి తనదంటూ బెదిరింపులు
– ఇదే వ్యవహారంలో గతంలో కేసు నమోదు
– గతంలో చీటింగ్ కేసుల్లో అరెస్ట్
Telangana News: స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ టీం: సంధ్యా శ్రీధర్ రావు.. పేరుకే వ్యాపార వేత్త. ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఈయన పేరు వినిపిస్తూనే ఉంటుంది. చీటింగ్ చేశాడని ఒకరు, కబ్జా చేశాడని ఇంకొకరు ఆయనపై ఫిర్యాదులు చేస్తూనే ఉంటారు. తాజాగా వివాదాస్పద ప్రభుత్వ స్థలం తనదంటూ మరోసారి అనుచరులను రంగంలోకి దింపాడు. జనం తిరగబడడంతో ఈ వివాదం హాట్ టాపిక్గా మారింది.
ప్రభుత్వ స్థలం కబ్జాకు ప్లాన్
గచ్చిబౌలిలో సంధ్యా కన్వెన్షన్ నడుపుతుంటాడు శ్రీధర్ రావు. దీని చుట్టూ ఖాళీ స్థలం దండిగా ఉంటుంది. వివాదాలు కూడా అంతే ఉన్నాయి. లీజుకు ఇచ్చిన భూమికి సంబంధించి కేసులు కూడా అయ్యాయి. అయితే, కన్వెన్షన్ వెనుక ఉన్న ప్రభుత్వ స్థలంపై కన్నేశాడు శ్రీధర్ రావు. అక్కడ పేదలు గుడిసెలు వేసుకోగా, వాటిని అనుచరులను పంపి ఖాళీ చేయించే ప్రయత్నం చేశాడు. చాలాకాలంగా అక్కడే పేదలు నివాసం ఉంటుంది. అయితే, ఈ స్థలం మాది అంటూ శ్రీధర్ రావు అనుచరులు హల్చల్ చేశారు. పేదలకు దాడులకు ప్రయత్నించారు. గుడిసెలను జేసీబీలతో బలవంతంగా తొలగించేందుకు చూశారు. పేదలకు మద్దతుగా ప్రజా సంఘాలు ఆందోళన చేపట్టాయి. జూన్లో ఇదే వ్యవహారానికి సంబంధించి శ్రీధర్ రావు సహా పలువురిపై కేసు కూడా ఫైల్ అయింది.
Also Read: Ganesh Chaturthi 2024: ఈ గణపతి మంత్రాలతో మీ కుటుంబంలోని సమస్యలు తొలగిపోతాయ్
కేసులంటే లెక్కేలేదు
సంధ్యా శ్రీధర్ రావుకు కేసులంటే లెక్కేలేదు. ఒక్క సైబరాబాద్ పరిధిలోనే ఆయనపై 30కి పైగా కేసులున్నాయి. ఇవేకాదు, ఇంకా కొన్ని కేసులు నమోదయ్యాయి. ఆమధ్య ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెరపైకి వచ్చినప్పుడు తన ఫోన్ కూడా ట్యాప్ అయిందని, బెదిరించి బీఆర్ఎస్ పార్టీకి ఫండ్ ఇచ్చేలా చేశారంటూ హల్చల్ చేశాడు శ్రీధర్ రావు. ట్విస్ట్ ఏంటంటే, బీఆర్ఎస్కు 12 కోట్ల ఫండ్ ఇచ్చి, వాటిని బెదిరించి తర్వాత తిరిగి తీసుకున్నాడు. చివరకు వారిపైనే పోలీస్ కేసు పెట్టాడు. ఇలా చెప్పుకుంటూ పోతే శ్రీధర్ రావు బాగోతాలెన్నో. పలుమార్లు అరెస్ట్ కూడా అయ్యాడు. ట్రాక్టర్ల విషయంలో అమితాబ్ బచ్చన్ బంధువులను రూ.250 కోట్ల దాకా మోసం చేశాడని ఫిర్యాదు అందగా, ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబైలో కొందరు బిల్డర్లను మోసం చేసినట్టు ఆరోపణలున్నాయి. జిమ్ ట్రైనర్పై వేధింపుల కేసు, ఈవెంట్ మేనేజర్పై దాడి ఇలా చాలా కేసులు ఫైల్ అయ్యాయి. అంతకుముందు రాయదుర్గం పోలీసులు కూడా అరెస్ట్ చేశారు. రూ.15 కోట్ల చీటింగ్ కేసుకు సంబంధించి అదుపులోకి తీసుకున్నారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో 12 ఎకరాల భూమి వివాదంలోనూ సంధ్యా శ్రీధర్ రావు పేరు వినిపించింది. ఇలా అనేక కేసుల్లో అరెస్ట్ అవ్వడం, బెయిల్పై బయటకు రావడం కామన్ అయింది. ఇప్పుడు పేదల గుడిసెల తొలగింపునుకు సంబంధించి కేసు ఫైల్ అవ్వగా, బలవంతంగా వారిని ఖాళీ చేయించేందుకు ప్రయత్నించాడు.