Telangana : విద్యుత్తు ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 7 శాతం ఫిట్మెంట్ పెంచింది. శనివారం సాయంత్రం హైదరాబాద్ లోని విద్యుత్ సౌధ సమావేశ మందిరంలో ఉద్యోగ సంఘాల జేఏసీ ఛైర్మన్ సాయిబాబు, కన్వీనర్ రత్నాకర్రావుతో ట్రాన్స్కో-జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకరరావు, రెండు విద్యుత్తు పంపిణీ సంస్థల సీఎండీలు రఘుమారెడ్డి, గోపాలరావు జరిపిన చర్చలు ఫలించాయి. వేతనాలు పెంచకపోతే ఈ నెల 17 నుంచి నిరవధిక సమ్మె చేస్తామని జేఏసీ గత నెల 30న నోటీసు ఇచ్చింది. చర్చలు ఫలించడంతో కొత్త వేతన సవరణ ఒప్పందంపై విద్యుత్ సంస్థల యాజమాన్యాలు, జేఏసీ నేతలు సంతకాలు చేశారు. సమ్మె నోటీసును జేఏసీ ఉపసంహరించుకుంది.
కొత్త పీఆర్సీ ప్రకారం…ప్రతి ఉద్యోగికి 7 శాతం ఫిట్మెంట్తో 2022 ఏప్రిల్ 1 నుంచి వేతనం వస్తుంది. గత 12 నెలల కొత్త పీఆర్సీ పెంపు బకాయిలను వచ్చే 12 నెలల్లో సమాన వాయిదాల్లో చెల్లిస్తారు. ఉద్యోగి సర్వీసు కాలం 5 ఏళ్లలోపు ఉంటే అదనంగా ఒక ఇంక్రిమెంట్, 5 నుంచి 15 ఏళ్లుంటే 2, అంతకుమించి సర్వీసు ఉంటే 3 ఇంక్రిమెంట్లు ఇస్తారు.
ఉద్యోగులకు ఇంటి అద్దె భత్యం, పింఛను చెల్లిస్తారు. రిటైర్మెంట్ గ్రాట్యుటీని రూ.12 లక్షల నుంచి రూ.16 లక్షలకు పెంచుతారు. వైద్య ఖర్చులకు చెల్లించే మొత్తాన్ని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచనున్నారు. 1999 నుంచి 2004 మధ్యకాలంలో ఉద్యోగాల్లో చేరినవారిని ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్లోకి మార్చాలనే ప్రతిపాదనను ట్రాన్స్కో పాలకమండలి సమావేశంలో ఆమోదించి ప్రభుత్వానికి పంపుతామని సీఎండీలు హామీ ఇచ్చారు.