Sahiti Infra Scam : ప్రీ లాంచ్ ఆఫర్తో వేలాది మంది వద్ద నుంచి లక్షలు వసూలు చేసి 900 కోట్ల భారీ మోసానికి పాల్పడ్డ సాహితి ఇన్ఫ్రా ఎండీ లక్ష్మీనారాయణను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిర్మాణాలు చేపట్టకముందే తక్కువ ధరకు గేటెడ్ కమ్యూనిటీ అపార్టుమెంట్లు ఇస్తామంటూ ఈ మోసానికి పాల్పడ్డాడు.
సాహితి ఇన్ఫ్రా వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ అమీన్పూర్లో 23 ఎకరాలలో సాహితీస్ శ్రావణి ఎలైట్ పేరుతో 38 అంతస్థులతో హైరేంజ్ అపార్టుమెంట్లు కడుతున్నానంటూ ప్రచారం చేసుకున్నాడు. 1200 చదరపు అడుగుల నుంచి 1700 చదరపు అడుగులలో డబుల్, త్రిబుల్ బెడ్ రూమ్లు కట్టిస్తామంటూ చెప్పుకున్నాడు.
ఇతని ప్రీ లాంచ్ ఆఫర్ ప్రకటనలు చూసి 1700 మంది ముందుకొచ్చారు, వారి నుంచి 539 కోట్లు వసూలు చేశాడు. ఒప్పందం ప్రకారం ఫ్లాట్లు నిర్మించి ఇవ్వకపోవడంతో బాధితులు లక్ష్మీనారాయణపై ఒత్తిడి తెచ్చారు. అయితే చెల్లించిన డబ్బుతో పాటు 15 నుంచి 18 శాతం సంవత్సరానికి వడ్డీ కలిపి ఇస్తానంటూ మరోసారి బాధితులకు మాట ఇచ్చి, చెక్కులను అందజేశాడు. అవి కూడా బౌన్స్ అయ్యాయి. దీంతో బాధితులు ఈ మోసంపై సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి అరెస్ట్ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సాహితి ఇన్ఫ్రా బాధితులున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ పాలకమండలి సభ్యత్వానికి సాహితి ఇన్ఫ్రా ఎండీ లక్ష్మీనారాయణ రాజీనామా చేశారు.
సాహితీస్ శ్రావణి ఎలైట్, సాహితి ఇన్ఫ్రా వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇలా పలు రకాలైన పేర్లతో వివిధ ప్రాంతాలలో నిందితుడు ప్రాజెక్ట్లు ప్రారంభించారు. ఇలా సీసీఎస్లో నమోదైన కేసుతో కలిపి సుమారు 2వేల500 మంది కస్టమర్ల నుంచి 900 కోట్ల వరకు ఆయా ప్రాజెక్టుల పేరుతో నిందితుడు వసూలు చేశాడు. లక్ష్మినారాయణపై ఇతర ప్రాంతాలలోను కేసులున్నాయి. ప్రజలు ఇలాంటి ప్రీ లాంచ్ ఆఫర్ల జోలికి వెళ్లి మోసాల బారిన పడవద్దని జాయింట్ సీపీ సూచించారు.