Bhatti Comments in Rythu Bharosa at utnoor: రైతులకు మేలు జరిగే విధంగా రైతు భరోసాను రూపొందిస్తామని రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. అందరి అభిప్రాయాలు తెలుసుకునేందుకు రైతు భరోసా సదస్సులను నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ లో రైతు భరోసా వర్క్ షాప్ ను నిర్వహించారు. కేబినెట్ సబ్ కమిటీ ఆధ్వర్యంలో రైతు భరోసా ఫథకం విధివిధానాలపై అభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడారు. అన్నదాతల అభిప్రాయాల మేరకు ప్రభుత్వ నిర్ణయం ఉంటుందన్నారు.
తమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణానికి యోచిస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. చిన్న రైతుల కోసం పథకాల రూపకల్పనకు ప్రభుత్వం ఆలోచన చేస్తుందని చెప్పారు. ప్రజలతో చర్చించి పథకాలను అమలు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రజల నుంచి సేకరించిన అభిప్రాయాలపై అసెంబ్లీలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామంటూ ఆయన పేర్కొన్నారు.
Also Read: హైదరాబాద్ గురించి కిషన్రెడ్డి మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా ఉంది: మంత్రి పొన్నం
ఇదిలా ఉంటే.. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధ్యక్షతన జీవో 317పై కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయ్యింది. ఈ సమావేశంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోపాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలను సబ్ కమిటీ ప్రకటించినట్లు తెలుస్తోంది.
కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో స్పౌజ్, మెడికల్, మ్యూచువల్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల భార్య/భర్త చేసుకున్న దరఖాస్తులపై కమిటీ సానుకూలంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కేబినెట్ సబ్ కమిటీకి చేసుకున్న దరఖాస్తులను సంబంధిత శాఖాధిపతులకు పంపించాల్సిందిగా జీఏడీ అధికారులకు కేబినెట్ సబ్ కమిటీ ఆదేశించినట్లు తెలుస్తోంది. మిగతా దరఖాస్తులను వివిధ శాఖలకు పంపి వాటిని పరిశీలన చేసిన తరువాత తిరిగి కేబినెట్ సబ్ కమిటీ దృష్టికి తీసుకురావాలని భేటీలో నిర్ణయించిట్లు సమాచారం.