Nagarjuna: రైతుబంధు. తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం. రాష్ట్రంలోని లక్షలాది మందికి ఎకరాకు 5 వేల చొప్పున ఏడాదికి రెండుసార్లు ఇస్తున్నారు. ఎకరం భూమి ఉంటేచాలు.. సాలుకి 10వేలు పక్కా. పంట పండించాలనే రూలేమీ లేదు.. పాస్ బుక్ ఉంటే చాలు.. పైసల్ బ్యాంకులో పడిపోతాయ్. అలానే టీఆర్ఎస్ కు ఓట్లు కూడా పడతాయనేది పథకం వెనుక ఉన్న వ్యూహం అనేది ప్రతిపక్షాల విమర్శ.
రైతుబంధుపై అనేక విమర్శలు ఉన్నాయి. కవులు రైతులకు డబ్బులు ఇవ్వకపోవడం ఓ లోటు. ఇక, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, 100 ఎకరాలు ఉన్న భూస్వాములకు, ఫాంహౌజులున్న బడాబాబులకు సైతం లక్షల్లో రైతుబంధు ఇవ్వడంపై పదే పదే విమర్శలు వస్తున్నాయి.
తాజాగా, రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి రైతుబంధు విధివిధానాలపై ఆరోపణలు చేశారు. ప్రత్యేకించి నాగార్జున పేరు ప్రస్తావించడంతో ఆసక్తి నెలకొంది. హైదరాబాద్లో జరిగిన ఓ సదస్సులో ఆకునూరి మురళి మాట్లాడుతూ.. “అమెరికాలో ఉంటున్న తనకు తెలిసిన వ్యక్తికి తెలంగాణలో వ్యవసాయ భూములు ఉన్నాయి. అతనికి కూడా రైతుబంధు అందుతోంది. అంతెందుకు, హీరో నాగార్జున కూడా రైతుబంధు ప్రయోజనాలను పొందారు. ఇంత సంపన్నులకు ఇది అవసరమా? బదులుగా రాష్ట్రంలోని 60 లక్షల మంది రైతుల్లో దాదాపు 22 లక్షల మంది కౌలు రైతులను తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలి” అని అన్నారు.