RTC MD Sajjanar: మహాలక్ష్మీ పథకంలో భాగంగా మహిళలకు ఆర్టీసీ ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణసౌకర్యం కల్పిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. అయితే తక్కువ దూరం వెళ్లే మహిళలు సిటీ సబర్బన్, లేదా పల్లె వెలుగు బస్సులను ఉపయోగించుకోవాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సూచించారు. ఎక్స్ ప్రెస్ బస్సుల్లో తక్కువ దూరం ప్రయాణించే మహిళలు ఎక్కువగా వెళ్తున్నట్లు RTC యాజమాన్యం దృష్టికి వచ్చిందన్నారు. దీనివల్ల దూర ప్రాంత ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందని సజ్జనార్ చెప్పారు.
అంతేకాకుండా కొందరు మహిళలు.. అనుమతించిన స్టేజీల్లో కాకుండా మధ్యలోనే బస్సులను ఆపమని సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నారని.. అలా చేయడం వల్రుల ప్రయాణ సమయం పెరుగుతుందన్నారు. ఇకపై ఎక్స్ ప్రెస్ బస్సులను అనుమతించిన స్టేజీల్లో ఆపుతామని స్పష్టం చేశారు. నాలుగైదు నెలల్లో మరో 2 వేలకు పైగా కొత్తబస్సులు అందుబాటులోకి తెస్తామని తెలిపారు. 400 ఎక్స్ ప్రెస్ లు, 512 పల్లె వెలుగు, 92 లహరి స్లీపర్ కమ్ సీటర్, 56 ఏసీ రాజధాని బస్సులున్నట్లు చెప్పారు. హైదరాబాద్ సిటీలో 540, తెలంగాణలో ఇతర ప్రాంతాలకు 500 బస్సుల్ని వాడకంలోకి తీసుకొస్తామని స్పష్టం చేశారు.