Rooster Auction: ఆర్టీసీ బస్సులో మూడు రోజుల క్రితం ఒక పందెంకోడి(Rooster) దొరికింది. ఆ కోడి తాలూక యజమానులెవరూ రాకపోవడంతో.. ఆర్టీసీ అధికారులు శుక్రవారం వేలం వేయాలని నిర్ణయించారు. ఇందుకు ఏర్పాట్లు కూడా చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు కరీంనగర్ డిపో-2లో వేలం వేస్తున్నట్లు ప్రకటించారు. ఇంతలోనే ట్విస్ట్ ఎదురైంది. ఆ బస్సులో దొరికిన పందెం కోడి తనదేనని ఒక వ్యక్తి సెల్ఫీ వీడియో విడుదల చేశాడు.
నెల్లూరు జిల్లాకు చెందిన మహేష్.. బ్రతకుతెరువు కోసం రుద్రంగికి వచ్చినట్లు చెప్పారు. రుద్రంగి నుంచి కరీంనగర్ మీదుగా నెల్లూరు వెళ్లే క్రమంలో.. తెల్లవారుజామున కరీంనగర్ బస్టాండ్ దిగి.. కోడిని మరచిపోయానని ఒక వీడియో విడుదల చేశాడు. వెంటనే పందెంకోడి వేలాన్ని ఆపాలని డిపో మేనేజర్ కు విజ్ఞప్తి చేశాడు. కానీ.. కోడి యజమాని అయినా సరే.. వేలంపాటలో పాల్గొనాలని డిపోమేనేజర్ నిర్లక్ష్యంగా మాట్లాడారని వాపోయాడు. ప్రయాణం సమయంలో తాను కోడికి కూడా టికెట్ తీసుకున్నానని, అందుకు తనవద్ద ఆధారాలున్నాయని తెలిపాడు. ఇప్పుడిదే తెలుగు రాష్ట్రాల్లో వైరల్ న్యూస్ గా మారింది.
కాగా.. ఆర్టీసీ నిబంధనల ప్రకారం.. ఎవరైనా బస్సులో వస్తువులను మరచిపోతే.. వాటిని 24 గంటల్లోగా ఎవరూ తీసుకోకపోతే.. లాస్ ఆఫ్ ప్రాపర్టీ కింద వాటికి వేలంపాట నిర్వహించాల్సి ఉంటుందని డిపో-2 మేనేజర్ తెలిపారు. ఈ పందెంకోడి వేలంలో వచ్చిన మొత్తాన్ని ట్రెజరీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు జమ చేస్తామని తెలిపారు. కానీ.. రుద్రంగికి చెందిన మహేష్ ఆ కోడి తనదేనని రావడంతో.. వేలాన్ని రద్దుచేశారు. ప్రస్తుతం పందెంకోడిని పశుసంవర్థక శాఖకు తరలించారు. ఆ కోడి నిజంగానే మహేష్ కు చెందినదా ? కాదా ?అన్న విషయంపై ఆరా తీస్తున్నారు.
.
.