Rohit Reddy: బండి సంజయ్ చెప్పిన రెండు రోజులకే తనకు ఈడీ నోటీసులు ఎలా వచ్చాయని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ప్రశ్నించారు. ఈడీ, సీబీఐలు బండి సంజయ్ కింద పని చేస్తున్నాయా? బండి సంజయ్ కు భవిష్యవాణి తెలుసా? అని నిలదీశారు. ఈ అంశంపై బండి సంజయ్ పై న్యాయ పరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు రోహిత్ రెడ్డి.
కర్ణాటక డ్రగ్స్ కేసులో తనపై బండి సంజయ్ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కర్నాటక పోలీసులు తనపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని.. తనను ఎవరూ ప్రశ్నించలేదని స్పష్టం చేశారు. తనపై చేసిన ఆరోపణలకు బండి సంజయ్ కట్టుబడి ఉంటారా? యాదగిరి గుట్టలో తడిగుడ్డలతో ప్రమాణం చేస్తారా? అని సవాల్ చేశారు రోహిత్ రెడ్డి.
ఎమ్మెల్యేల కొనుగోలు గుట్టును రట్టు చేసినందుకే తనకు ఈడీ నోటీసులు వచ్చాయని.. ఇలాంటి బెదిరింపులకు భయపడేదేలే.. తగ్గేదేలే.. అంటూ తేల్చి చెప్పారు. ఈడీ తనకు ఇచ్చిన నోటీసులో ఎలాంటి విషయం లేదని.. తన బయోడేటా అడగడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి. న్యాయవాదులతో చర్చించి ఈడీ నోటీసులకు జవాబిస్తామన్నారు.