Road Accident : ఆర్టీసీ బస్సు కార్గో వ్యాన్ ఢీ కొనడంతో ఒక వ్యక్తి మృతిచెందాడు. ఈ దారుణ ఘటన రేగొండ మండలంలోని కొత్తపల్లి గ్రామ సరిహద్దులో ప్రధాన రహదారిపై చోటు చేసుకుంది. స్థానిక ఎస్సై మాధవ్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం ఫ్లిప్ కార్ట్ సంస్థకు చెందిన కార్గో వ్యాన్ కరీంనగర్ నుంచి భూపాలపల్లి వెళ్తోంది.
ఈ క్రమంలో భూపాలపల్లి నుంచి హనుమకొండ వైపు వెళ్తున్న భూపాలపల్లి డిపో ఆర్టీసీ బస్సును కార్గో వ్యాన్ ఢీ కొట్టింది. వ్యాన్ డ్రైవర్ ప్రేమ్ సాగర్ (29) అక్కడికక్కడే మృతి చెందాడు. అర్టీసీ బస్సు డ్రైవర్, కండక్టర్, ఒక ప్రయాణికురాలికి తీవ్ర గాయాలయ్యాయి. బస్సులో ప్రయాణిస్తున్న మరికొందరు ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయి. బాధితులను అంబులెన్స్ లో పరకాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు ప్రేమ్ సాగర్.. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలానికి చెందిన వాడిగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రులు స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.