A private travel bus overturned in Nalgonda: తెలంగాణలో మరో బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. నల్గొండ జిల్లా వేములపల్లి వద్ద ఓ ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 30 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వెంటనే తోటి ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు ప్రమాదంపై పోలీసులు ఆరా తీశారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రైవేట్ ట్రావెల్ బస్సు జగిత్యాల నుంచి దర్శి వెళ్తోంది. నల్గొండ జిల్లా అద్దంకి-నార్కెట్పల్లి ప్రధాన రహదారి వద్ద ఒక్కసారిగా అదుపుతప్పి బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 30 మంది ప్రయాణికులకు గాయాలు కాగా..మరికొంతమందికి ఎలాంటి గాయాలు కాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు క్రేన్ సహాయంతో బస్సులో ఇరుక్కున్న ప్రయాణికులను బయటు తీశారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
అతివేగం కారణంగానే బస్సు బోల్తా పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే వేగంగా వస్తున్న బస్సు బోల్తా పడిన ఎలాంటి ప్రాణహాని జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఇదిలా ఉండగా, వేములపల్లి మండల పరిధిలోని శెట్టిపాలెం శివారులోని ఓ రైస్ మిల్లు వద్ద డీసీఎం వ్యాన్ ను ట్రావెల్ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందారు. ఒకే రోజు వివిధ ప్రాంతాల్లో ట్రావెల్ బస్సులు బోల్తా పడడంతో ప్రయాణికులు ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే జంకుతున్నారు.
మరోవైపు, పతనంతిట్ట కులనాడలో ఉదయం ఓ టూరిస్ట్ బస్సు, గూడ్స్ లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 17 మంది గాయపడగా..నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 45 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.