Road Accident in Hyderabad: హబ్సిగూడలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పాఠశాల నుంచి ఇంటికి వెళ్తున్న క్రమంలో స్కూటీని వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తల్లీకూతుళ్లు కిందపడ్డారు. ఈ ప్రమాదంలో విద్యార్థిని మృతి చెందింది.
వివరాల ప్రకారం.. తార్నాక డివిజన్ హనుమాన్ నగర్ రోడ్డు నంబర్ 12లో సంతోషి, నీల్ కుమార్లు నివాసం ఉంటున్నారు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. వీరిద్దరూ ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారు. కూతురు కామేశ్వరి(10) ఆరోతరగతి చదువుతోంది. అయితే ఎప్పటిలాగే పాఠశాల నుంచి పిల్లలను సంతోషి తన స్కూటీపై ఇంటికి తీసుకెళ్తోంది. హబ్సిగూడ వద్ద వీరు ప్రయాణిస్తున్న స్కూటీని లారీ ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో కామేశ్వరి కాళ్లపై నుంచి లారీ వెళ్లడంతో తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు చెప్పారు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎట్టకేలకు డ్రైవర్ మియారామ్ జట్(40)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో కూతురిని పట్టుకొని తల్లీ కన్నీరుమున్నీరైంది. దీంతో అందరినీ కంటతడిపెట్టించింది.
Also Read: కవిత బెయిల్పై వ్యాఖ్యలు.. సుప్రీంకోర్టుపై సీఎం రేవంత్ సంచలన ట్వీట్
ఇదిలా ఉండగా, ఇటీవల అదే ప్రాంతంలో లారీ..ఆటోను ఢీకొట్టడంతో పదో తరగతి విద్యార్థి మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆటోలో ప్రయాణిస్తుండగా.. వేగంగా వచ్చిన లారీ సిగ్నల్ వద్ద ఆగి ఉన్న ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటో ఎదురుగా ఉన్న బస్సు కిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో విద్యార్థిని మృతి చెందగా.. ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదంలో ఆటో పూర్తిగా బస్సు కిందకు ఇరుక్కుపోయింది. క్రేన్ సహాయంతో బయటకు తీయాల్సి వచ్చింది.