RGV: రాంగోపాల్ వర్మ. ఆయన ఎంటర్ అయ్యారంటే విషయం కంపుకంపు లేవాల్సిందే. కానీ, ఈసారి ఓ హూమన్ యాంగిల్ ఎంచుకున్నారు. కుక్కల దాడిలో బాలుడి మరణంపై చలించిపోయారు. ఘటనపై అయ్యో పాపం అంటూనే.. GHMC మేయర్ టార్గెట్గా అనేక కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ చేశారు. వరుస ట్వీట్లతో ట్విట్టర్ను హోరెత్తించారు. ఆ కిల్లర్ డాగ్స్కు మేయరే లీడర్ అని.. హైదరాబాద్లోని లక్షలాది కుక్కలను ఒకచోట చేర్చి.. వాటి మధ్య మేయర్ విజయలక్ష్మిని వదిలేయాలంటూ.. ఘాటు కామెంట్లే చేశారు. అలాగే, కుక్కల దాడి ఘటనపై హైకోర్టు స్పందించడాన్ని స్వాగతించారు ఆర్జీవీ.
‘శునకాలకు ఆకలి వేయడం వల్లే చిన్నారిపై దాడి చేశాయి’ అని జీహెచ్ఎమ్సీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి చేసిన స్టేట్మెంట్ ఆర్జీవీని బాగా హర్ట్ చేసింది. గతంలో ఆమె తన పెంపుడు కుక్కకు రోటీ తినిపిస్తున్న వీడియోను రీట్వీట్ చేస్తూ.. వరుస ట్వీట్లు చేశారు.
పెంపుడు కుక్కకు మేయర్ తన చేతులతో రొట్టె తినిపిస్తున్న ఈ వీడియోను.. నగరంలోని అన్ని శునకాలకు చూపించాలి.. అప్పుడు ఆకలి వేసినప్పుడల్లా కుక్కలు చిన్నారులపై దాడి చేయకుండా నేరుగా మేయర్ ఇంటికి వెళ్తాయంటూ సెటైర్లు వేశారు. అప్పుడే ఆమె చెత్త సలహాలు ఇవ్వకుండా ఉంటారని అన్నారు.
కిల్లర్ డాగ్స్కు ఆమె రియల్ లీడర్ అని అనిపిస్తోంది.. చిన్నారిపై దాడి చేసిన శునకాలకు బహుశా ఆమే శిక్షణ ఇచ్చి ఉంటారనే అనుమానం కూడా కలుగుతోంది. మంత్రి కేటీఆర్, హైదరాబాద్ పోలీసులు దీనిపై విచారణ చేయాలి. ఇంత జరిగినా ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ గద్వాల్ విజయలక్ష్మి తన మేయర్ పదవికి ఎందుకు రాజీనామా చేయకూడదు? అని నిలదీశారు వర్మ.
ఆ రౌడీ/గూండా కుక్కలను మీ ఇంటికి తీసుకెళ్లి వాటికి ఆహారం పెట్టవచ్చు కదా!.. అప్పుడు అవి మన పిల్లలను తినకుండా ఉంటాయి. కేటీఆర్ సర్, దయ చేసి నగరంలో ఉన్న 5 లక్షల కుక్కలను డాగ్హోమ్కు తరలించి.. మధ్యలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మిని వదిలేయండి.. అంటూ కాంట్రవర్సీ ట్వీట్ చేశారు ఆర్జీవీ.