Revanthreddy : రైతు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి లేఖాస్త్రాన్ని సంధించారు. పండించిన పంటలకు మద్దతు ధర దక్కకుండా దళారులు రైతులను మోసం చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం కనీసం స్పందించడం లేదని మండిపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు సమస్యలను ఎవరితో చెప్పుకోవాలని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాల ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా సగటున రోజు ఇద్దరు అన్నదాతలు బలవన్మరణానికి పాలపడుతున్నారని తెలిపారు. రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ నాలుగో స్థానంలో ఉందని జాతీయ క్రైం బ్యూరో లెక్కలు చెబుతున్నాయని వివరించారు. ఈ నివేదిక ప్రకారం 2014 నుంచి 2022 వరకు రాష్ట్రవ్యాప్తంగా 7,069 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. ఈ ఏడాదిలో నవంబర్ వరకు రాష్ట్రంలో 512 మంది రైతులు బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారని తెలిపారు. రాష్ట్రంలో 16 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారని రేవంత్ తెలిపారు. ఆత్మహత్య చేసుకుంటున్న రైతుల్లో 80 శాతం కౌలు రైతులే ఉన్నారని లేఖలో వివరించారు. ప్రభుత్వం మాత్రం కౌలు రైతుల కోసం ఏమి చేయడం లేదని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
రేవంత్ రెడ్డి డిమాండ్లు ఇవే..
రాష్ట్రంలో పంటల బీమా పథకం అమలు కావడంలేదని ఫలితంగా రైతులకు నష్టపరిహారం కూడా అందడం లేదని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఆత్మహత్యల నివారణపై దృష్టి సారించాలని సూచించారు. రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కార మార్గాలను అన్వేషించాలని కోరారు. కాంగ్రెస్ పక్షాన ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చిన డిమాండ్లపై తక్షణం స్పందించాలని లేకుంటే రైతుల తరపున క్షేత్రస్థాయిలో పోరాటానికి దిగాల్సి ఉంటుందని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.