Revanthreddy : హైదరాబాద్ బోయిన్పల్లి గాంధీ ఐడియాలజీ సెంటర్లో జరుగుతున్న పీసీసీ సదస్సులో రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు మీడియా మొత్తం సపోర్ట్ చేసినా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ను ఏమీ చేయలేకపోయారని గుర్తుచేశారు. ఏ మీడియా కూడా శాసించలేదని స్పష్టం చేశారు. చిన్న చిన్న సమస్యలు ఉంటే పరిష్కరించుకుందామని పార్టీ నేతలకు సూచించారు. 2003లో ఎలాంటి విపత్కర పరిస్థితులను ప్రజలు ఎదుర్కొన్నారో 2023లోనూ అలాంటి పరిస్థితులే ఉన్నాయన్నారు. ఇలాంటి పరిస్థితుల నుంచి ప్రజలను రక్షించేది కాంగ్రెస్ పార్టీనే అని స్పష్టం చేశారు. అందరూ కష్టపడితే కేసీఆర్ లెక్కే కాదని స్పష్టం చేశారు. అధికారం సాధించే దిశగా పనిచేద్దామని పార్టీ నేతలకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
దేశ సరిహద్దులు ఆక్రమణలకు గురవుతున్నా ప్రధాని మోదీ స్పందించడం లేదని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ప్రధానిగా అవకాశం వచ్చినా సోనియా గాంధీ పదవి స్వీకరించలేదని గుర్తుచేశారు. దేశానికి మంచి నాయకత్వాన్ని సోనియా అందించారన్నారు. చలిని సైతం లెక్కచేయకుండా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేస్తున్నారని వివరించారు. దేశంలో విచ్చినకర శక్తులకు భయపడకుండా యాత్ర కొనసాగుతోందని స్పష్టం చేశారు. జనవరి 26న జెండా ఎగరవేయడంతో బాధ్యత తీరలేదన్నారు. అందుకే కాంగ్రెస్ జాతీయ నాయకత్వం హాత్ సే హాత్ జోడో అభియాన్ కార్యక్రమం చేపట్టాలని సూచించిందని తెలిపారు.
2003లో దివంగత మహానేత వైఎస్ఆర్ చేపట్టిన పాదయాత్ర ఒక సంచలనమని సీఏల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. మీడియా మొత్తం వ్యతిరేకంగా ఉన్నా.. ఇందిరమ్మ రాజ్యం తెస్తానని వైఎస్ఆర్
బయలుదేరి పాదయాత్రతో సమూల మార్పులు తీసుకువచ్చారని వివరించారు. తనలాంటి వారు ఎంతో మంది వైఎస్ఆర్ పాదయాత్రలో భాగస్వామ్యులు అయ్యారని అన్నారు.
పీసీసీ సదస్సులో ధరణి పోర్టల్పై పార్టీ నేతలకు అవగాహన కల్పిస్తున్నారు. జనవరి 26న ప్రారంభం కానున్న హాత్ సే హాత్ జోడో యాత్రపై చర్చిస్తున్నారు. పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి బీమా అమలు, ఎన్నికల నిబంధనలపై చర్చిస్తున్నారు. కాంగ్రెస్ సదస్సుకు పలువురు సీనియర్ డుమ్మాకొట్టారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి, మధుయాష్కీ, శ్రీధర్ బాబు, రాజనర్సింహ, మహేశ్వర్ రెడ్డి హాజరుకాలేదు.
ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, దిగ్విజయ్ సింగ్ సూచనలను సీనియర్లు పెడచెవినపెట్టారు. ఈ పరిణామంపై ఏఐసీసీ సభ్యుడు సమావేశానికి ముందు బోసు రాజు స్పందించారు. ఏఐసీసీ కార్యక్రమానికి అందరూ హాజరు కావాల్సిందేనని స్పష్టం చేశారు. ఉత్తమ్ డిఫెన్స్ కమిటీ సమావేశానికి , శ్రీధర్బాబు కర్ణాటక పీసీసీ మీటింగ్కు వెళ్లారని తెలిపారు. ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి అసలు తనకు పిలుపురాలేదన్న కామెంట్పై చేయడంపై పార్టీలో చర్చ జరుగుతోంది.