RevanthReddy : పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేపట్టిన హాథ్ సే హాథ్ జోడో యాత్రకు రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది. ప్రజాసమస్యలు తెలుసుకుంటా రేవంత్ ముందుకు సాగుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సిన అవసరాన్ని ఓటర్లకు చెబుతున్నారు. అన్నివర్గాల ప్రజలతో మమేకమవుతూ తమ ప్రభుత్వం వస్తే ఏం చేస్తామో స్పష్టం చేస్తున్నారు. రేవంత్ ప్రసంగాలు సామాన్యులను ఆలోచింపజేస్తున్నాయి. కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నాయి. అందుకే పాదయాత్రలో అడుగడుగునా జనం బ్రహ్మరథం పడుతున్నారు. ఈ విషయాన్ని గమనించే అధికార పార్టీ బీఆర్ఎస్ కుట్రలకు తెరలేపి పాదయాత్రలో అల్లర్లు సృష్టిస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.
రేవంత్ పాదయాత్ర తొలుత ప్రశాంతంగా సాగింది. అయితే ఎప్పుడైతో ప్రజల నుంచి భారీ స్పందన కనిపించిందో అప్పటి నుంచి కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయి. వరంగల్ లో ఓ యువ కాంగ్రెస్ నేతను దారుణంగా కొట్టారు. తీవ్రగాయాలపాలైన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడిని రేవంత్ పరామర్శించి భరోసా కల్పించారు. ఇలా దాడులతో భయపెట్టినా కాంగ్రెస్ శ్రేణులు మరింత పట్టుదలతో పాదయాత్రలో పాల్గొంటున్నాయి. ఇది బీఆర్ఎస్ నేతలకు కంటగింపుగా మారిందని ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏకంగా రేవంత్ రెడ్డినే టార్గెట్ చేశారని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.
భూపాలపల్లి సభలో రేవంత్రెడ్డి మాట్లాడుతుండగా దాదాపు వందమంది బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడున్న థియేటర్ల వద్దకు చేరుకున్నారు. టమాటాలు, కోడిగుడ్లు, రాళ్లు విసిరారు. రేవంత్రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇది గమనించిన కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు రేవంత్ కు రక్షణగా నిలిచారు. ఈ సమయంలో సభ వద్ద గందరగోళం నెలకొంది. బందోబస్తులో పాల్గొన్న కాటారం ఎస్సై శ్రీనివాస్ తలకు, కంటికి గాయాలయ్యాయి. వెంటనే ఆయనను స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. రేవంత్రెడ్డి ఉన్న వాహనంపైకి రాళ్లు పడుతుండగా కాంగ్రెస్ నాయకులు శాలువాను అడ్డంగా పట్టుకున్నారు.
దాడి ఘటన తర్వాత బీఆర్ఎస్ నేతలపై రేవంత్ ఫైర్ అయ్యారు. వందమందిని తీసుకువచ్చి దాడి చేయిస్తావా? దమ్ముంటే నువ్వు రాబిడ్డా అంటూ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిని ఉద్దేశించి సవాల్ చేశారు. ఇక్కడ ఎస్పీ ఎమ్మెల్యేకు బంధువని అందుకే బీఆర్ఎస్ నాయకులు ఇలా బరితెగించారని మండిపడ్డారు.
అంతకుముందు భూపాలపల్లి అంబేడ్కర్ కూడలి వద్ద కాంగ్రెస్ ఫ్లెక్సీ కట్టొద్దని అడ్డుకున్నారు. ఈ క్రమంలో రెండు పార్టీల నేతలు మధ్య ఘర్షణ జరిగింది. ఇలా రేవంత్ పాదయాత్ర చేస్తున్న ప్రాంతాల్లో కాంగ్రెస్ శ్రేణులను బెదిరించడం, దాడుల చేయడంపై ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి వస్తున్న జనాదరణ చూసి బీఆర్ఎస్ నేతలు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు.