RevanthReddy: డబుల్ బెడ్ రూం ఇండ్లు ఎవరికైనా వచ్చాయా? తెలంగాణలో రైతు ఆత్మహత్యలు ఆగాయా? నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చాయా? అంటూ ప్రజలకు సూటిగా ప్రశ్నించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తెలంగాణలో మార్పు రావాలంటే.. ప్రభుత్వం మారాలి.. ఉద్యోగాలు రావాలంటే ప్రభుత్వం మారాలి.. ఆత్మహత్యలు ఆగాలంటే ప్రభుత్వం మారాలి.. అంటూ కేసీఆర్ సర్కారుపై ములుగులో సమరశంఖం పూరించారు రేవంత్ రెడ్డి. మేడారం సమ్మక్క, సారలమ్మల సాక్షిగా హాత్ సే హాత్ జోడో యాత్ర ప్రారంభించారు.
బడ్జెట్ లెక్కలు వాస్తవానికి దూరంగా ఉన్నాయన్నారు రేవంత్. బడ్జెట్కు విలువ లేదని కొట్టిపారేశారు. తొమ్మిదేండ్లలో కేసీఆర్ ప్రభుత్వం 25 లక్షల కోట్ల బడ్జెట్ పెడితే.. 119 నియోజకవర్గాల్లో ఎంత ఖర్చు చేశారని ప్రశ్నించారు. అందులో ఎంత దొంగల మయం అయ్యిందంటూ నిలదీశారు. కేసీఆర్ డబ్బులను నమ్ముకుంటే.. తాము ప్రజలను నమ్ముకున్నామన్నారు.
మేడారం సమ్మక్క సారలమ్మల స్ఫూర్తితోనే తాను పాదయాత్ర చేస్తున్నానని.. కాంగ్రెస్ ముఖ్య నేతలంతా యాత్రలో భాగస్వామ్యులు అవుతారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు రేవంత్ రెడ్డి.
రేవంత్ రెడ్డి పాదయాత్రను చూస్తుంటే తనకు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గుర్తొస్తున్నారని షబ్బీర్ అలీ అన్నారు. అప్పట్లో వైఎస్ఆర్ చెల్లెమ్మా అంటూ చేవెళ్ల నుంచి యాత్ర చేశారని.. ఇప్పుడు రేవంత్.. సీతక్క అంటూ ములుగు నుంచి యాత్ర మొదలు పెట్టారని షబ్బీర్ అలీ అన్నారు. హాత్ సే హాత్ జోడో పాదయాత్ర ద్వారా రాహుల్ సందేశాన్ని గ్రామ గ్రామాన తీసుకెళ్లి.. ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుంటామన్నారు. సమ్మక్క, సారలమ్మ ఆశీస్సులతో యాత్ర జరుగుతోందన్నారు.