RevanthReddy : తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేపట్టిన హాత్ సే హాత్ జోడో పాదయాత్ర ఉత్సాహంగా సాగుతోంది. ప్రజాసమస్యలు తెలుసుకుంటూ ఆయన ముందుకు సాగుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. తాజాగా వేములవాడలో పాదయాత్ర కొనసాగించిన రేవంత్ .. రాజన్నను దర్శనం చేసుకున్నారు. భక్తుల కోరికలు తీర్చే రాజన్నను దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు.
వేములవాడ రాజన్నను సైతం కేసీఆర్ మోసం చేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని ఇచ్చిన మాట తప్పారని విమర్శించారు. గతంలో కాంగ్రెస్ హయాంలోనే ఆలయ అభివృద్ధి జరిగిందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే భక్తుల అవసరాలకు అనుగుణంగా ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. కేంద్రం నుంచి కూడా నిధులు తెచ్చి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని రేవంత్ డిమాండ్ చేశారు.
మిడ్ మానేరు బాధితుల విషయంలో ప్రభుత్వం తీరును రేవంత్ రెడ్డి తప్పుపట్టారు. నిర్వాసితులకు పరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం కొర్రీలు పెడుతోందని మండిపడ్డారు. పెళ్ళైన ఆడపిల్లలకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వడం లేదన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులకు పరిహారం ఇచ్చి గిరిజనులకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. మిడ్ మానేరు బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నిర్వాసితులు చేస్తున్న పోరాటానికి కాంగ్రెస్ మద్దతుగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.
వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పైనా రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్యే ఎప్పుడూ విదేశాల్లోనే ఉంటారనే విషయాన్ని గుర్తు చేశారు. నియోజకవర్గంలో అభివృద్ధి జరగాలంటే స్థానికుడినే
గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థిని గెలుపించాలని కోరారు.