RevanthReddy : హైదరాబాద్ అంబర్ పేటలో కుక్కల దాడిలో బాలుడు ప్రాణాలు కోల్పోవడంపై టీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి ఆర్థికసాయం చేయకుండా ప్రభుత్వం క్షమాపణులు చెప్పి చేతులు దులుపుకుందని మండిపడ్డారు. బాధితులపై సానుభూతి చూపించలేరా అని ప్రశ్నించారు. ఇది రాక్షస ప్రభుత్వమని విమర్శించారు. పురపాలకశాఖ మంత్రిగా కేటీఆర్ విఫలమయ్యారని అన్నారు. చిన్నారిని వీధికుక్కలు చంపేస్తే ప్రభుత్వం మానవత్వం లేకుండా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బాలుడి మృతి ఘటనపై హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి స్పందించిన తీరును రేవంత్ రెడ్డి తప్పుపట్టారు. కుక్కలకు ఆకలేసిందని మేయర్ మాట్లాడారని మండిపడ్డారు. వీధి కుక్కలు పసివాళ్లను పీక్కు తినే పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉందన్నారు. కుక్కల దాడుల్లో ప్రాణాలు పోతుంటే.. కుక్కలకు కుటుంబ నియంత్రణ చేస్తామని మంత్రి చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలపై రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యేల భూముల ఆక్రమణలపై విచారణకు కేటీఆర్ సిద్ధమా? అని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. కేటీఆర్ కు వాటాలు లేకుంటే విచారణకు ఆదేశించాలని కోరారు. నిరూపించడానికి తమ నాయకులు సిద్ధంగా ఉన్నారన్నారు. వరంగల్ జిల్లాను బీఆర్ఎస్ గూండాలు ఆక్రమించుకున్నారని విమర్శించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. కాంట్రాక్టుల కోసం పార్టీ మారిన ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి పనికిమాలిన రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.