Revanthreddy : రేవంత్ రెడ్డి టీపీసీసీ పదవి చేపట్టాక ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారు. తెలంగాణలో జరిగిన వివిధ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయాలను చవిచూసింది. అటు పార్టీలో సీనియర్ నేతల నుంచి సహకారం లోపించింది. ఏదో విధంగా రేవంత్ ను వెనక్కి లాగాలన్న ప్రయత్నాలు చాలా మంది నేతలు చేస్తున్నారు. అయినా సరే ఎంతో ఓపికతో పార్టీని నడిపిస్తున్నారు రేవంత్. దూకుడుగా ముందుకెళ్తూ బీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారు. మరోవైపు సీనియర్ నేతలతో సయోధ్య చేసుకునేందుకు తనే వెనక్కి తగ్గి పార్టీ ప్రయోజనాలే ముఖ్యంగా ముందుకు సాగుతున్నారు. చాలా మంది నేతలు నేరుగా రేవంత్ ను టార్గెట్ చేసి విమర్శలు చేసినా ..వాటిని సైతం లెక్కచేయకుండా కులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు.
తాజాగా నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లిలో నిర్వహించిన దళిత, గిరిజన ఆత్మగౌరవ సభ సాక్షిగా రేవంత్ తన వైఖరేంటో మరింత క్లారిటీ ఇచ్చారు. అంతర్గత గొడవలతోనే కాంగ్రెస్ కు సరిపోతుందని ప్రత్యర్థి పార్టీలు అనుకుంటున్నాయని కానీ అలాంటి పంచాయితీలు ఇక ఉండవని తేల్చిచెప్పారు. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడతామని హెచ్చరికలు పంపారు.ఈ సభను విజయవంతం చేయడానికి కృషి చేసిన నాగం జనార్ధన్ రెడ్డిని ప్రశంసించారు. అంతేకాదు గతం నుంచి ఆయన ప్రజల కోసం చేస్తున్న సేవలను గుర్తు చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లా అభివృద్ధిలో నాగం జనార్ధన్ రెడ్డి పాత్ర ఎంత ఉందో వివరించారు. ఇలా తన ప్రసంగంలో చాలాసేపు నాగం జనార్ధన్ రెడ్డి గురించి చెప్పుకొచ్చారు. ఇలా పార్టీ కోసం కష్ట పడుతున్న నేతలను శ్రమను గుర్తిస్తూ సభ సక్సెస్ క్రెడిట్ ఆయనకే ఇచ్చారు.
పీసీసీ అధ్యక్షుడిగా పార్టీని గెలిపించే బాధ్యత తనదే రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇదే సమయంలో సీఎం అభ్యర్థిపై పూర్తి క్లారిటీ ఇచ్చారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ అధిష్టానం ఏ నాయకుడిని ముఖ్యమంత్రిగా ప్రకటించినా ఆ నేతను తానే స్వయంగా మోసుకెళ్లి సీఎం సీటులో కూర్చోబెడతానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీఎం పదవి కోసం చాలా మంది పోటీలో ఉంటారు. సీఎం రేసులో ముందున్న నేతలను వెనక్కి లాగేందుకు ఎప్పటికప్పుడు ఇతర నేతలు ప్రయత్నాలు చేస్తుంటారు. అందుకే అలాంటి వారికి చెక్ పెట్టేలా రేవంత్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. సీఎం అభ్యర్థి ఎవరో తేల్చే బాధ్యత అధిష్టానానిదేనని స్పష్టం చేశారు. సీఎం అభ్యర్థి ఎవరనే చర్చకు ఇలా ఫుల్ స్టాప్ పెట్టారు. అదే సమయంలో పార్టీని అధికారంలోకి తేచ్చే బాధ్యత మాత్రం తనదే స్పష్టం చేశారు. ఇలా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతూ తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నారు రేవంత్.